భారత ఆర్థికవ్యవస్థ కుదించుకుపోవచ్చు

by  |
భారత ఆర్థికవ్యవస్థ కుదించుకుపోవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థికవ్యవస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 9.6 శాతం కుదించుకుపోతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్ కీలకమైన సంస్కరణలు కొనసాగించాల్సిన అవసరముందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. దక్షిణాసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9.6 శాతం క్షీణిస్తుందని తెలిపింది.

అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత్ 5.4 శాతం వృద్ధితో తిరిగి పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. కరోనా వ్యాప్తికి సంబంధించి విధించిన నియంత్రణలు 2022 సమయానికి తొలగిపోతాయని అంచనా వేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. కరోనా కారణంగా అంతర్జాతీయంతో పాటు, దేశీయంగా కూడా ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మందగిస్తాయని వెల్లడించింది.

తద్వారా ఎగుమతులు, దిగుమతులు దెబ్బతినే ప్రమాదముందని వివరించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత్‌ పరిస్థితి మరింత దిగజారుతోందని ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త హాన్స్ టిమర్ అభిప్రాయపడ్డారు. భారత ఆర్థికవ్యవస్థ కరోనాకు ముందే మందగమన పరిస్థితులను ఎదుర్కొంటోంది. వీలైనంత సమగ్రమైన చర్యల ద్వారా ఈ విపత్తును భారత్ అధిగమించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Next Story

Most Viewed