ఇండియా బెస్ట్ డ్యాన్సర్‌గా ‘టైగర్ పాప్’

by  |
ఇండియా బెస్ట్ డ్యాన్సర్‌గా ‘టైగర్ పాప్’
X

దిశ, వెబ్‌డెస్క్ : సోనీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’‌ ఫస్ట్ సీజన్ ట్రోఫీని గురుగ్రామ్‌కు చెందిన డ్యాన్సర్ టైగర్ పాప్ గెలుచుకున్నాడు. డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలుపడ్డ టైగర్ పాప్.. కల నెరవేరిన నేపథ్యంలో ఈ విజయాన్ని తన తల్లికి అంకితమిచ్చాడు. అతని పేరు అజయ్ సింగ్ కానీ, టైగర్ పాప్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

చిన్నారుల కోసం రూపొందించిన డ్యాన్స్ రియాలిటీ షో ‘సూపర్ డ్యాన్సర్’ సూపర్ సక్సెస్ కావడంతో.. సోనీ ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. 12 మంది కంటెస్టెంట్లతో జులై 18న మొదలై, నవంబర్ 22(ఆదివారం)న ముగిసిన ఈ రియాలిటీ షోలో గురుగ్రామ్ కుర్రాడు అజయ్ సింగ్ (టైగర్ పాప్) విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా టైగర్ పాప్ మాట్లాడిన మాటలు అందరి హృదయాలను దోచుకున్నాయి. ‘మా అమ్మ డొమెస్టిక్ హెల్పర్‌గా పనిచేస్తుంది. నన్ను డ్యాన్సర్‌గా చూడాలనుకున్న తన కోరికను నెరవేర్చేందుకు చిన్నప్పటి నుంచే ప్రతి స్టేజ్ మీద డ్యాన్స్ చేశాను. అమ్మ నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఇప్పుడు నేను ట్రోఫీ గెలిచి ఆమెకు బహుమతిగా ఇస్తున్నాను. ఇక మీదట నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు. నాకు సాధ్యమైనరీతిలో ప్రతి క్షణం నీకు అండగా ఉంటాను. ఈ ట్రోఫీ, ప్రైజ్ మనీ నీకే అంకితం’ అని టైగర్ పాప్ తెలిపాడు. టైగర్ పాప్ ఈ విజయంతో 15 లక్షల ప్రైజ్ మనీతో పాటు కారును సొంతం చేసుకున్నాడు. అతడి కొరియోగ్రాఫర్ వర్తిక జా రూ. 5 లక్షల బహుమతి అందుకుంది.

భవిష్యత్తులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లకు కొరియోగ్రఫీ అందించాలని ఉందన్న టైగర్ పాప్.. డ్యాన్స్‌లో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత పేరు తీసుకురావాలని, అమెరికాస్ గాట్ టాలెంట్‌లోనూ పాల్గొని ట్రోఫీ కొట్టాలనుకుంటున్నాని తెలిపాడు. ‘కలలు కనండి, మనమీద మనం నమ్మకముంచి ముందడుగు వేస్తే, ఆ కలలు తప్పక నెరవేరతాయి’ అని చెప్పుకొచ్చాడు.

ఈ రియాలిటీ షోకు మలైక అరోరా, గీతా కపూర్, టెరెన్స్ లెవిస్ జడ్జీలుగా వ్యవహరించగా.. రెమో డిసౌజ, నోరా ఫతేహి స్పెషల్ జడ్జీలుగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి హోస్ట్స్‌గా వ్యవహరించిన కమెడియన్ భర్తి సింగ్‌ను, ఆమె భర్త హర్ష్ లింబాచియాలను డ్రగ్స్ కేసులో పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Next Story