తొలి వార్మప్ మ్యాచ్ డ్రా..

by  |
ravindra jadeja
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు దుర్హామ్‌లోని రివర్‌సైడ్ స్టేడియంలో తొలి వార్మప్‌ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఇండియన్స్ ఎలెవెన్, కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ మధ్య జరిగిన మూడు రోజు మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియన్స్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార చక్కటి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. జాక్ కార్సన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ (47) వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికే చతేవ్వర్ పుజార (38) కూడా పెవీలియన్ చేరాడు. ఇక హనుమ విహారి, రవీంద్ర జడేజా కలసి కౌంటీ సెలెక్ట్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీ చేసిన రవీంద్ర జడేజా ఈ ఇన్నింగ్స్‌లో కాస్త ధాటిగా ఆడాడు. విహారి, జడేజా కలసి మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జడేజా మరో అర్ద సెంచరీ (51) పూర్తి చేసుకున్నాడు. డ్రెస్సింగ్ రూం నుంచి పిలుపు రావడంతో జడేజా రిటైర్డ్ అవుట్‌గా పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత మరో పది పరుగులుజోడించి భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. విహారి (43), శార్దుల్ ఠాకూర్ (6) నాటౌట్‌గా నిలిచాడు. జాక్ కార్సన్ 2 వికెట్లు తీశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో కౌంటీ సెలెక్ట్ ఓపెనర్లు ఆచితూచి ఆడారు. జాక్ లిబ్బీ (17), హసీబ్ హమీద్ (13) వికెట్ పడకుండా కాపాడు కున్నారు. మూడో రోజు సమయం ముగియడంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ వల్ల టీమ్ ఇండియాకు మంచి ప్రాక్టీస్ లభించింది. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ మ్యాచ్‌లో మెరిసారు. రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయగా.. రవీంద్ర జడేజా రెండు ఇన్నింగ్స్‌లలో అర్ద సెంచరీలు నమోదు చేశాడు. ఇక కౌంటీ సెలెక్ట్ జట్టులోని హమీద్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడు భారత్‌తో జరిగే సిరీస్‌కు ఇంగ్లాండ్ తరపున ఎంపిక కావడం విశేషం.

స్కోర్ బోర్డు క్లుప్తంగా..

ఇండియన్స్ 311 & 192/3 డిక్లేర్డ్
కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ 220 & 31/0


Next Story

Most Viewed