థామస్ కప్ క్వార్టర్ ఫైనల్ చేరిన భారత జట్టు

by  |
Sai Praneet
X

దిశ, స్పోర్ట్స్: థామస్ కప్‌లో భారత పురుష బ్యాడ్మింటర్ ప్లేయర్ల బృందం వరసగా రెండో విజయం సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్‌ను 5-0 తేడాతో ఓడించిన షట్లర్లు.. తాజాగా తాహితిపై కూడా 5-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 2010 తర్వాత భారత షట్లర్లు థామస్ కప్ క్వార్టర్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. తొలుత సింగిల్స్‌లో బి సాయి ప్రణీత్ 21-5, 21-6 తేడాతో లూయిస్ బ్యూబోయిస్‌పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 21-12, 21-12 తేడాతో రెమీ రోస్సీని ఓడించాడు. కిరణ్ జార్స్ 21-4, 21-2 తేడాతో ఎలియాస్ ముబ్లాంక్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ కేవలం 15 నిమిషాల్లో ముగియడం విశేషం. డబుల్స్ జోడి క్రిష్ణ ప్రసాద్ – విష్ణ వర్దన్ 21-8, 21-7 తేడా విజయం సాధించారు. ఇక సాత్విక్ రెడ్డి – చిరాగ్ శెట్టి 21-5, 21-3 తేడాతో ముబ్లాంక్-హీయా యోనెట్‌పై గెలవడంతో భారత జట్టు 5-0 ఆధిక్యతతో ఈ రౌండ్‌ను ముగించింది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ సిలో భారత జట్టు టాప్ 2లో నిలిచింది. తర్వాత బలమైన చైనాతో భారత జట్టు తలపడనున్నది.

ఉబెర్ కప్‌లో భారత్‌కు ఓటమి..

ఉబెర్ కప్ మూడో మ్యాచ్‌లో భారత షట్లర్ల బృందం 0-5 తేడాతో థాయ్‌లాండ్‌పై ఓడిపోయింది. స్పెయిన్ (3-2), స్కాట్లాండ్ (4-1)పై వరుస విజయాలు సాధించిన భారత మహిళలు థాయ్‌లాండ్‌పై మాత్రం ఓటమి పాలయ్యారు. మాల్వికా బాన్సోద్ 15-21, 11-21 తేడాతో చోచోవాంగ్ చేతిలో ఓడింది. అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడి 16-21, 12-21 తేడాతో కితిహారకుల్-ప్రజోంజయ్‌పై ఓడిపోయారు. సింగిల్స్ మ్యాచ్‌లో అదితి భట్ 16-21, 21-18, 15-21 తేడాతో బుసానన్ చేతిలో ఓటమిపాలయ్యింది. ట్రెస్సా జాలీ-గాయత్రి గోపీచంద్ 17-21, 16-21 తేడాతో సుపాజిరకుల్ – సప్సిరీ చేతిలో ఓడిపోయారు. ఇక చివరి మ్యాచ్‌లో తాస్నిమ్ 19-21, 15-21 తేడాతో సుపానిందపై ఓడిపోయింది. భారత జట్టు అన్ని మ్యాచ్‌లు ఓడి 0-5 తేడాతో వెనకబడింది. అయితే భారత షట్లర్ల బృందం ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నది.


Next Story

Most Viewed