ఈ ఏడాది రెండంకెల వృద్ధి దిశగా భారత ఐటీ పరిశ్రమ!

by  |
Azim-Premji
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమ ఆదాయం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. కొవిడ్ మహమ్మారి లాంటి సంక్షోభ సమయంలో ఐటీ పరిశ్రమ ప్రపంచాన్ని నడిపిస్తోందని, మార్పులకు అనుగుణంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. బాంబే ఛార్టెడ్ అకౌంటెంట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాస్కామ్ అంచనాల ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమ ఆదాయం సుమారు రూ. 15 లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో 2021-22లో పరిశ్రమ రెండంకెల వృద్ధిని సాధించవచ్చని, ఒకవేళ కరోనా మరింత ఉధృతమైతే 2-3 శాతం వృద్ధి ఖాయమని అజీమ్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం లభించిందని, 90 శాతం మంది ఇప్పటికీ ఇంటి నుంచే పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఇంటికి, ఆఫీస్‌కి మధ్య సమన్వయం చేస్తూ కొనసాగుతున్న హైబ్రిడ్ వర్క్ మోడల్ పరిశ్రమలో పోటీని పెంచుతోందన్నారు. ఈ మార్పుల వల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మెరుగైన భాగస్వామ్యాన్ని కొనసాగించడంతో పాటు మహిళలు సైతం వారి ఉద్యోగాన్ని సానుకూల వాతావరణంలో కొనసాగించే సౌకర్యాన్ని అందిస్తోందని’ అజీమ్ ప్రేమ్‌జీ వివరించారు. అన్ని విధాలుగా సవాళ్లను అధిగమిస్తూ కొనసాగుతున్న మనం, అంతర్జాతీయంగా భారత్‌కున్న నైపుణ్యాన్ని కేంద్రంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అజీమ్ ప్రేమ్‌జీ సూచించారు. అంతేకాకుండా దేశ ఆర్థికవ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే ఐటీ పరిశ్రమ గణనీయమైన తోడ్పాటు అందించాల్సి ఉందని ఆయన వెల్లడించారు. కాగా, గురువారం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ఐటీ కంపెనీలు విడుదల చేయనున్నాయి.



Next Story

Most Viewed