2033 నాటికి రూ. 3.5 లక్షల కోట్లకు హెల్త్-టెక్ రంగం వృద్ధి

by  |
2033 నాటికి రూ. 3.5 లక్షల కోట్లకు హెల్త్-టెక్ రంగం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత హెల్త్-టెక్ మార్కెట్ 2020-23 ఆర్థిక సంవత్సరాల మధ్య ఉన్న వార్షిక వృద్ధి రేటు 39 శాతంతో పోలిస్తే 2033 నాటికి సుమారు రూ. 3.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ నివేదిక తెలిపింది. టెలీమెడిసిన్, ఈ-ఫార్మసీ, ఫిట్‌నెట్, వెల్‌నెస్, హెల్త్‌కేర్ ఐటీ, అనలిటిక్స్, హోమ్ హెల్త్‌కేర్, పర్సనల్ హెల్త్ మేనేజ్‌మెంట్ వంటి ఆరు విభాగాలు కలిగిన హెల్త్-టెక్ మార్కెట్ ప్రస్తుతం రూ. 14.5 వేల కోట్లుగా ఉంది. భారత్‌లో మొత్తం ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో ఇది 1 శాతం కన్నా తక్కువ అని ఆర్‌బీఎస్ఏ సలహాదారుల నివేదిక పేర్కొంది.

ఈ పరిశ్రమలో కరోనా మహమ్మారి తెచ్చిన సాంకేతిక వినియోగంతో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఈ పరిశ్రమలో అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయని, 2017 నుంచి దేశీయ హెల్త్-టెక్ రంగంలో రూ. 11.6 వేల కోట్ల నిధులు వచ్చి చేరాయని’ ఆర్‌బీఎస్ఏ సలహాదారుల ఎండీ, సీఈఓ రాజీవ్ షా చెప్పారు. 2023 నాటికి ఈ రంగం రూ. 36 వేల కోట్లకు, మరో పదేళ్లలో 3.5 లక్షల కోట్లకు పెరుగుతుందని నివేదిక అభిప్రాయపడింది. గతేడాది హెల్త్-టెక్ మార్కెట్లో రూ. 5 వేల కోట్లతో ఈ-ఫార్మసీ అతిపెద్ద విభాగంగా ఉంది.

తర్వాత బీ2బీ హెల్త్-టెక్ మార్కెట్ రూ. 437 కోట్లు, బీ2బీ వైద్య సామగ్రి విభాగం రూ. 210 కోట్లు, ఇతర హెల్త్-టెక్ సేవల విభాగం రూ. 727 కోట్లు, ఈ-డయాగ్నస్టిక్ రూ. 509 కోట్లు, టెలీ కన్సల్టేషన్ రూ. 327 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఆన్-బాడీ డివైజెస్, బ్లాక్‌చెయిన్ వంటి సరికొత్త టెక్నాలజీ, హెల్త్-టెక్ రంగం భవిష్యత్తును మార్చనున్నట్టు నివేదిక వెల్లడించింది. అలాగే, ఈ రంగంలో క్లౌడ్ మౌలిక సదుపాయాలు, రోగుల హెల్త్‌కేర్ రికార్డుల డిజిటలైజేషన్ పెరుగుతుండటంతో పరిశ్రమ వేగవంతం అయ్యే అవకాశం ఉందని నివేదిక వివరించింది.

Next Story

Most Viewed