దోహాలో తాలిబన్లతో భారత్ చర్చలు

by  |
doha
X

దిశ వెబ్‌డెస్క్: అప్ఘానిస్తాన్‌ను తాలిబన్లు అక్రమించుకున్న తర్వాత తొలిసారిగా తాలిబన్లతో దోహలోని భారత ఎంబసీ అధికారుల సమావేశమయ్యారు. తాలిబన్ రాజకీయ కార్యాలయ అధ్యక్షుడు షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో భారత్ ఎంబసీ అధికారి దీపక్ మిట్టల్‌ అప్ఘాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిపారు. దీనికి సంబంధించి విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘ఖతార్ ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిట్టల్, తాలిబన్ నేత మహ్మద్ అబ్బాస్‌తో సమావేశం నిర్వహించారు.

తాలిబన్ల కోరిక మేరకు దోహాలోని భారత ఎంబసీలో చర్చ జరిగింది’ అని పేర్కొంది. కాగా ఈ సమావేశంలో ముఖ్యంగా అఫ్ఘానిస్తాన్‌లో ఉన్న భారతీయుల తరలింపు, భద్రత, రక్షణ వంటి విషయాలపై ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించింది. భారత్‌కు వచ్చే అప్ఘాన్ మైనారిటీ పౌరుల గురించి కూడా చర్చల్లో పేర్కొనట్లు తెలిపింది. ఈ సందర్భంగా అఫ్ఘాన్ నేలపై భారత వ్యతిరేక చర్యలైన ఉగ్రవాదం ఇతర కార్యకలాపాలపై ఆందోళనగా ఉన్నట్లు మిట్టల్ లేవనెత్తారని వెల్లడించింది. కాగా భారత్ చర్చించిన అంశాలపై తాలిబన్లు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొంది. భారత్‌తో ఆర్థిక, రాజకీయ సంబంధాలకు ఆసక్తిగా ఉన్నట్లు అబ్బాస్ ప్రాంతీయ మీడియాతో వెల్లడించారు. అయితే, దీనిపై భారత్ నుంచి ఎటువంటి స్పందన లేదని తెలిపారు.

ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం..

అప్ఘానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాన మంత్రి అధ్యక్షతన విదేశాంగ వ్యవహారాల మంత్రి జయశంకర్, జాతీయ భద్రత అధికారి అజిత్ దోవల్, సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. యూఎస్ బలగాలు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం అప్ఘాన్‌లో మిగిలిపోయిన భారత పౌరులను, మైనార్టీలను తీసుకువచ్చే అంశంపై దృష్టి పెట్టారు. మరోవైపు అప్ఘానిస్తాన్ భారత్ ఇప్పటికే అభివృద్ధి పనుల్లో దాదాపుగా రూ.200కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. కానీ, ఒక్కసారిగా తాలిబన్లు అక్రమించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతకుముందు 1996-2001లో తాలిబన్లు అప్ఘానిస్తాన్ లో అధికారంలో ఉన్నపుడు భారత్ రష్యా, ఇరాన్ లకు మద్ధతిస్తూ వారికి వ్యతిరేకంగా నిలబడింది.


Next Story