2021లో భారత్ రెండంకెల వృద్ధి సాధ్యమే : మూడీస్

by  |
2021లో భారత్ రెండంకెల వృద్ధి సాధ్యమే : మూడీస్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ‘సెకెండ్ వేవ్’ కారణంగా భారత వృద్ధి అంచనాలు ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయని, వైరస్‌ను అరికట్టేందుకు తీసుకునే చర్యల వల్ల ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడమే దీనికి కారణమని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్ వెల్లడించింది. అయితే, 2021లో భారత్ రెండంకెల జీడీపీ వృద్ధిని సాధించగలదని మూడీస్ అభిప్రాయపడింది. ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితులను పరిశీలించిన మూడీస్, మరోసారి లాక్‌డౌన్ విధించనవసరం లేదని అభిప్రాయపడింది. అదేవిధంగా గతేడాది కరోనా సమయంలో కంటే ఈ సారి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావ తీవ్రత తక్కువగా ఉంటుందని భావిస్తున్నట్టు మంగళవారం తన నివేదికలో పేర్కొంది. ‘ భారత్‌లో కరోనా వైరస్ మరణాల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంది. తక్కువ జనాభాకు వైరస్ సోకడం ఆర్థికవ్యవస్థకు సానుకూల పరిణామం. ఈ నేపథ్యంలో 2021కి జీడీపీ రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని’ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో ‘సెకెండ్ వేవ్’ వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు ఏప్రిల్ చివరి వరకు కొనసాగించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఆర్థిక పునరుద్ధరణ బలహీనపడవచ్చని, అయితే దేశంలోని ప్రజలందరికీ టీకా అందించడంతో పురోగతి సాధించడం ద్వారా క్రెడిట్-ప్రతికూల ప్రభావం తగ్గించవచ్చని తెలిపింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడీస్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 13.7 శాతానికి మెరుగుపరిచింది. అలాగే, 2021 క్యాలెండర్ ఏడాదికి ఆర్థిక వృద్ధి రేటును 12 శాతంగా అంచనా వేసింది. అధికారిక అంచనాల ప్రకారం మార్చితో ముగిసిన 2020-21లో భారత ఆర్థికవ్యవస్థ 8 శాతం కుదించుకుపోయింది.

Next Story

Most Viewed