ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత దౌత్యవేత్తలు వెనక్కి!

by  |
Indian diplomats
X

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల నియంత్రణ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత దౌత్యవేత్తలను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే పనులు ప్రారంభించినట్టు తెలిసింది. భారత సిబ్బంది ప్రాణాలు తమకు అత్యంత ప్రాధాన్యమని కేంద్ర విదేశాంగ తెలిపింది. కాందహార్‌లోని కాన్సులేట్ నుంచి దౌత్యవేత్తలు, ఇతర సిబ్బంది, భద్రతా బలగాలు మొత్తం కలిపి 50 మందిని స్వదేశానికి తీసుకువచ్చినట్టు సమాచారం. వీరి కోసం ప్రత్యేకంగా భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని శనివారం ఆఫ్ఘనిస్తాన్ పంపింది. కాందహార్‌లోని భారత కాన్సులేట్‌ను మూసేసినట్టు ఆదివారం వార్తలు వచ్చాయి.

వీటిని భారత విదేశాంగ శాఖ ఖండించింది. భారత అధికారులను స్వదేశానికి రప్పించామని, అది తాత్కాలిక చర్యేనని వివరించింది. అక్కడ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత తిరిగి పంపిస్తామని, ఇంతలోపు స్థానిక ఉద్యోగులు కాన్సులేట్ సేవలు అందిస్తారని తెలిపింది. వీసా మంజూరీలు, కాన్సులేట్ సేవలు కాబూల్ రాయబార కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దేశంలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నందున భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కాబూల్‌లోని భారత ఎంబసీ గతవారం సూచించింది.

ఈ తరుణంలో భారత దౌత్యవేత్తలను తిరిగి స్వదేశానికి రప్పించే ప్రణాళికలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో పెరుగుతున్న హింసాత్మక పరిస్థితులను భారత్‌లోని ఆ దేశ రాయబారి ఫరీద్ మముంద్‌జే భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాకు వివరించారు. అఫ్ఘాన్‌లోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed