టెస్ట్ సిరీస్‌నూ ఊడ్చేసిన కివీస్

by Shyam |   (  Updated:2020-03-02 05:20:40  IST  )

<p>టీమ్ ఇండియాకు న్యూజిలాండ్‌ పర్యటనలో భంగపాటు ఎదురైంది. సుదీర్ఘ పర్యటన కోసం న్యూజిలాండ్ వెళ్లిన భారత జట్టు టీ20 సిరీస్‌ను వైట్‌వాష్ చేసినా వన్డే, టెస్టు సిరీస్‌ల్లో మాత్రం ఘోర పరాజయాలను మూట గట్టుకుంది. రెండు టెస్టు మ్యాచుల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయి ఉత్త చేతులతో వెనుదిరిగి వస్తోంది. కెప్టెన్ కోహ్లీ వైఫల్యంతోపాటు టెస్టుల్లో బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచే పుజారా, రహానే లాంటి వాళ్లు కూడా చేతులెత్తేయడం భారత జట్టు ఓటమికి ముఖ్య కారణాలుగా నిలిచాయి. క్రైస్ట్‌చర్చ్‌లోని [&hellip;]</p>

టెస్ట్ సిరీస్‌నూ ఊడ్చేసిన కివీస్
X

టీమ్ ఇండియాకు న్యూజిలాండ్‌ పర్యటనలో భంగపాటు ఎదురైంది. సుదీర్ఘ పర్యటన కోసం న్యూజిలాండ్ వెళ్లిన భారత జట్టు టీ20 సిరీస్‌ను వైట్‌వాష్ చేసినా వన్డే, టెస్టు సిరీస్‌ల్లో మాత్రం ఘోర పరాజయాలను మూట గట్టుకుంది. రెండు టెస్టు మ్యాచుల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయి ఉత్త చేతులతో వెనుదిరిగి వస్తోంది. కెప్టెన్ కోహ్లీ వైఫల్యంతోపాటు టెస్టుల్లో బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచే పుజారా, రహానే లాంటి వాళ్లు కూడా చేతులెత్తేయడం భారత జట్టు ఓటమికి ముఖ్య కారణాలుగా నిలిచాయి.

క్రైస్ట్‌చర్చ్‌లోని హేగ్లే ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టుపై ఆతిథ్య న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. 90/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా మరో 34 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయ్యింది. ఇక 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈరోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే హనుమ విహారి(9) టిమ్ సౌథీ బౌలింగ్‌లో కీపర్ వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే రిషబ్ పంత్ (4) కూడా పెవిలియన్ చేరాడు. టెయిలెండర్లు మహ్మద్ షమి (5), జస్ప్రీత్ బుమ్రా (4) కూడా త్వరత్వరగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో 124 పరుగులకు భారత జట్టు చాప చుట్టేసింది. తొలి ఇన్నింగ్స్ 7 పరుగుల ఆధిక్యంతో కలిపి న్యూజిలాండ్ ఎదుట 132 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

132 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్ (52), బ్లండెల్ (55) చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరే లక్ష్యాన్ని ఛేదించేలా కనపడ్డారు. కానీ, వీరి జోడిని ఉమేశ్‌యాదవ్ విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన విలియమ్‌సన్(5), బ్లండెల్‌లను బూమ్రా అవుట్ చేశాడు. రాస్ టేలర్ (5), నికోల్స్ (5) కివీస్ జట్టును విజయతీరాలకు చేర్చారు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన కైల్ జేమిసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

స్కోర్ బోర్డు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 242
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235
ఇండియా రెండో ఇన్నింగ్స్‌: 124
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్: 132

tags : India, new zealand tour, indian cricket team lost test series

Next Story