ఇండియన్ బ్యాంక్ నికర నష్టం రూ. 218 కోట్లు!

by  |
ఇండియన్ బ్యాంక్ నికర నష్టం రూ. 218 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ బ్యాంక్ 2020 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 217.74 కోట్లు అని వెల్లడించింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో 189.77 కోట్ల నష్టాన్ని నమోదు చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో ఆదాయం రూ.5,537.47 కోట్ల నుంచి రూ.6,334.37 కోట్లకు పెరిగిందని బ్యాంకు తెలిపింది. బ్యాడ్ లోన్స్, కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంక్ కేటాయింపులు రూ. 1,891.86 కోట్లకు పెంచినట్టు, అంతకుముందు ఇదే త్రైమాసికంలో రూ.1,638.83 కోట్లని బ్యాంకు తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి స్థూల నిరర్ధక ఆస్తులు 6.87 శాతానికి తగ్గాయని, అంతకుముందు ఇది 7.11 శాతంగా ఉంది. నికర నిరర్ధక ఆస్తులు 3.75 శాతం నుంచి 3.13 శాతానికి స్వల్పంగా ఉన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు నికర లాభం రూ. 322 కోట్ల నుంచి రూ. 753 కోట్లకు పెరిగిందని బ్యాంకు తెలిపింది. నిర్వహణ లాభం 33 శాతం పెరిగి రూ.6,948 కోట్లని, అంతకుముందు ఇది రూ.4,881 కోట్లు అని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8 శాతం పెరిగి రూ.7,606 కోట్లుగా, వడ్డీయేతర ఆదాయం 76 శాతం పెరిగి రూ.3,312 కోట్లని వెల్లడించింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఆర్థిక పనితీరు ఎంతవరకు ప్రభావితం ఉంటుందో భవిష్యత్తు పరిణామాలపై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతానికి అనిశ్చితంగా ఉన్నట్టు, పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంకు తెలిపింది.


Next Story

Most Viewed