భారతీయులు మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు : జో బైడెన్

by  |
Joe Biden
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో ఉంటున్న భారత సంతతి అమెరికన్లు తమ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అత్యున్నత పదవులు అధిరోహించి.. నానాటికీ ఈ దేశంలో తమ ప్రాతినిథ్యాన్ని పెంచుకుంటున్నారని ఆయన అన్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) శాస్త్రవేత్తలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జో బైడెన్ మాట్లాడుతూ.. ‘అమెరికాలో భారత సంతతి వేగంగా విస్తరిస్తున్నది. వాళ్లు ఈ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీరు (స్వాతి మోహన్), అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, నా ప్రసంగ కాపీ రాసిన వినయ్ రెడ్డి అందరూ భారతీయ సంతతి అమెరికన్లే..’ అని అన్నారు. నాసా నిర్వహిస్తున్న మార్స్ మిషన్‌కు స్వాతి మోహన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతి గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆమె కృషి వెలకట్టలేనిదని కొనియాడారు.

ఇది కూడా చదవండి : నందిగ్రామ్‌లో దీదీని ఢీకొనబోయేది ఆయనేనా..?

ఈ ఏడాది జనవరి 20 న అమెరికా 46 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బైడెన్.. తన పాలనా యంత్రాంగంలో చాలా వరకు ఇండో అమెరికన్ సంతతి వ్యక్తులనే నియమించారు. సుమారు 55 మంది భారత సంతతి అమెరికన్లు కీలక పదవుల్లో కొలువుదీరి ఉన్నారు. కాగా వీరిలో సగానికి పైగా మహిళలే ఉండటం గమనార్హం. అంతకుముందు 2009-2017 మధ్య కాలంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత సంతతి వ్యక్తులు వైట్ హౌస్ లో కీలక పదవులు నిర్వర్తించారు. కానీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక వారి సంఖ్యను చాలావరకు తగ్గించారు. తిరిగి బైడెన్ వచ్చిన తర్వాత ఆ సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నది.


Next Story