నందిగ్రామ్‌లో దీదీని ఢీకొనబోయేది ఆయనేనా..?

by  |
suvendu Adhikari vs mamata banerjee
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల రాజకీయం హీట్ హైఓల్టేజీకి చేరింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటలయుద్ధం తీవ్రంగా కొనసాగుతున్నది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎలాగైనా గద్దె దించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగిన ప్రణాళికలను రచిస్తున్నది. ఈ క్రమంలోనే ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బలమైన నాయకుడిని పోటీలో నిలపాలని చూస్తున్నది.

దీదీని ఢీకొట్టాలంటే అంతటి సామర్థ్యం కలిగిన నేతనే బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తున్నది. ఇందుకోసం ఇన్నాళ్లు టీఎంసీలోనే ఉండి, మమత క్యాబినెట్‌లో పనిచేసిన సువేందు అధికారిని పోటీలో నిలుపుతున్నది. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే సమాచారం అందిందని తెలుస్తున్నది. బెంగాల్‌లో మొదటి విడతలో జరగబోయే ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను నేడు విడుదల చేయనున్నారు. సువేందు అభ్యర్థిత్వంపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇన్నాళ్లు మమత క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న సువేందు అధికారి.. అక్కడ రవాణా, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. గతేడాది ఆయన టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నందిగ్రామ్‌లో పోటీ గురించి గతంలో సువేందు మాట్లాడుతూ.. బీజేపీ అధిష్టానం ఒకవేళ తనను మమతపై పోటీ చేయమని ఆదేశిస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ, ఆమెపై సుమారు 50 వేలకు పైచీలుకు ఓట్ల మెజారిటీతో గెలుస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇక కొద్దిరోజులుగా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు బెంగాల్ లోనే మకాం వేశారు. ఈసారి ఎలాగైనా బెంగాల్‌ను చేజిక్కించుకోవాలని కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే విషయమై ఆ పార్టీ స్టేట్ చీఫ్ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. 294 సీట్లకు గాను తమ పార్టీ 200కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల నుంచే అందుకోసం తాము కష్టపడుతున్నామనీ, దానికి తగిన ప్రతిఫలం తప్పక దక్కి తీరుతుందని అన్నారు. మొత్తం ఎనిమిది దశలలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ మార్చి 27న మొదలు కానుండగా.. ఏప్రిల్ 29న ముగియనున్నది. మే 2న ఫలితాలు వెలువడుతాయి.

ఇది కూడా చదవండి : పైలెట్‌పై దాడిచేసిన పిల్లి.. విమానం అత్యవసర ల్యాండింగ్

Next Story

Most Viewed