టీ-20వరల్డ్ కప్‌లో భారత్ బోణీ

by  |
టీ-20వరల్డ్ కప్‌లో భారత్ బోణీ
X

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 132 పరుగుల చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు.. భారత బౌలర్ల వేగాన్ని తట్టుకోలేక 115 పరుగుల వద్దనే కుప్పకూలారు.

మ్యాచ్ మొదలు జోరు మీద ఉన్న ఆస్ట్రేలియాను.. భారత బౌలర్లు పూనమ్ యాదవ్, శిఖా పాండే బెంబేలెత్తించారు. కీలక సమయంలో పూనమ్ నాలుగు వికెట్లు తీసుకోగా.. శిఖా పాండే మూడు వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియా జట్టును పాతాళంలో నెట్టారు. రాజేశ్వరి గైక్వాడ్ ఓ వికెట్ తీసుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ అలీసా హీలీ 51, ఆష్లీ 34 పరుగులు చేసి కాసేపు ఆకట్టుకున్నారు. మిగతా వారు ఎవరూ పట్టుమని పది పరుగులు చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభమే దక్కింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ 49, షెఫాలీ వర్మ 29, జెమీమా రోడ్రిగ్స్ 26 పరుగులతో అలరించారు. వీరికి తోడు స్మృతి మంధాన 10, వేదా కృష్ణమూర్తి 9, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2 పరుగులు చేయడంతో స్కోర్ బోర్డు 132కు చేరింది. ఆసీస్ బౌలర్లలో జెస్ జొనాసెన్ 2 వికెట్లు పడగొట్టగా, ఎలీస్ పెర్రీ, డెలిస్సా కిమిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు.

Next Story

Most Viewed