రెండు వారాల క్వారంటైన్‌కి సిద్ధపడుతున్న టీం ఇండియా..

by  |
రెండు వారాల క్వారంటైన్‌కి సిద్ధపడుతున్న టీం ఇండియా..
X

దిశ, స్పోర్ట్స్ :

కరోనా వైరస్ ప్రభావంతో క్రికెట్ పూర్తిగా స్తంభించింది. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ముగిసినా భారత జట్టు ఆడే మ్యాచ్‌లేవీ లేవు. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు పాల్గొనాల్సి ఉండగా.. టీం ఇండియా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీయులెవరినీ తమ దేశంలోనికి రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లను మాత్రం అనుమతించాలని ఆస్ట్రేలియా సూత్రప్రాయంగా నిర్ణయించింది. కానీ, వాళ్లందరినీ తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాల్సిందేనని చెబుతోంది. దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు. పర్యాటక జట్టు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆస్ట్రేలియా ఆదేశించడంలో తప్పేం లేదన్నారు. ఇన్ని రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న క్రీడాకారులకు 14 రోజులు పెద్ద విషయమేమీ కాదని ఆయన అన్నారు. క్రికెట్ ఆటను తిరిగి ప్రారంభించాలంటే ఇలాంటి నిబంధనలకు అలవాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే లాక్‌డౌన్ అనంతరం భారత ప్రభుత్వం క్రీడాకారుల ప్రయాణాలకు అనుమతులు ఇస్తుందో లేదో అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని ధుమాల్ అన్నారు.

మరోవైపు క్రికెట్ ఆగిపోవడం వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో భారత్‌తో ఆడే మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. దాదాపు 300 మిలియన్ డాలర్ల నష్టంతో క్రికెట్ ఆస్ట్రేలియా సంక్షోభంలో కూరుకుపోయింది. దీనిపై అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. ఇప్పటికైతే బీసీసీఐ అదనపు మ్యాచ్‌లు ఆడే విషయంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయినా టెస్టు మ్యాచుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ.. అదనపు టెస్టు మ్యాచ్ బదులు రెండు వన్డేలు కానీ, రెండు టీ20లు కానీ ఆడితే రెవెన్యూ రావొచ్చని ధుమాల్ అభిప్రాయపడ్డారు.

Tags: Cricket, Australia, Team India, Arun Dhumal, Quarantine, T20 World Cup, Test Match

Next Story

Most Viewed