ఇండియా vs ఇంగ్లాండ్: నాలుగో టెస్టులో నిలిచేదెవ్వరు

by  |
ఇండియా vs ఇంగ్లాండ్: నాలుగో టెస్టులో నిలిచేదెవ్వరు
X

దిశ, స్పోర్ట్స్ : అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో గురువారం నుంచి చివరిదైన నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు వల్ల ఇంగ్లాండ్ జట్టుకు పోయేదేమీ లేదు. కానీ టీమ్ ఇండియాకు మాత్రం చాలా కీలకం. పేటీఎం సిరీస్ గెలవాలన్నా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరాలన్నీ నాలుగో టెస్టు తేల్చనున్నది. భారత జట్టు ఈ టెస్టు గెలిచినా, డ్రా చేసుకున్న పర్వాలేదు. కానీ ఓడిపోతే ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ చేరుకుంటుంది. అందుకే టీమ్ ఇండియా మరోసారి ‘స్పిన్ మంత్రం’తో ఇంగ్లాండ్‌ను కట్టడి చేయాలని భావిస్తున్నది. పింక్ బాల్ టెస్టును రెండు రోజుల్లోపే గెలుచుకున్న టీమ్ ఇండియా.. మరోసారి అలాంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని భావిస్తున్నది.

పిచ్ ఎలా ఉంది?

పేటీఎం సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం తర్వాత బీసీసీఐ పిచ్‌లపై దృష్టి పెట్టింది. స్పిన్నర్లకు అనుకూలించే స్లో పిచ్‌లు తయారు చేయించి రెండు, మూడు టెస్టులను గెలుచుకున్నది. అహ్మదాబాద్‌లో జరిగిన పింక్ బాల్ టెస్ట్ రెండు రోజుల్లో ముగియడంపై పిచ్‌పై పలు విమర్శలు వచ్చాయి. కానీ భారత స్పిన్నర్ల ప్రతిభను మాత్రం అందరూ పొగిడారు. ఇప్పుడు మొతేరాలోనే నాలుగో టెస్టు జరుగుతున్నది. గత పిచ్ లాంటిదే ఈ మ్యాచ్‌కు కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. మూడో టెస్టు పింక్ బాల్ కాగా.. నాలుగో టెస్టు రెడ్ బాల్‌తో ఆడనున్నారు. పింక్ బంతి ఎక్కువగా పట్టు జారిపోతుంది.. ఎరుపు బంతి మాత్రం అలా ఉండదు. బంతి పేసర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంటుంది. టర్న్ అయ్యే పిచ్ తయారు చేస్తే తొలి రెండు రోజులు పేసర్లకు అనుకూలించి.. తర్వాత స్పిన్నర్లకు స్వర్గధామంలా మారే అవకాశం ఉన్నది. కాబట్టి ఇరు జట్లు బౌలింగ్ విభాగంలో పేసర్లు, స్పిన్నర్లను సమతూకంలో తీసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

టీమ్ ఇండియా ఇలా..

టీమ్ ఇండియా తుది జట్టులోకి ఉమేష్ యాదవ్ వచ్చే అవకాశం ఉన్నది. బుమ్రా వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన ఉమేష్‌ను తీసుకునే అవకాశం ఉన్నది. స్వదేశంలో మంచి రికార్డు ఉండటంతో పాటు.. ఉమేష్ యాదవ్ పాత బంతితో కూడా స్వింగ్ రాబట్టగలిగే సత్తా ఉన్నది. ఇషాంత్ శర్మతో పాటు ఉమేష్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు పేసర్లతో దిగితే సిరాజ్‌కు కూడా చోటు దక్కవచ్చు. ఇక వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడే అవకాశం ఉన్నది. అశ్విన్, అక్షర్‌లకు తోడుగా మూడో స్పిన్నర్‌గా సుందర్ అంతగా ప్రభావం చూపడం లేదు. ఇద్దరు పేసర్లను తీసుకుంటే.. మూడో స్పిన్నర్‌గా కుల్దీప్‌యాదవ్ స్థానం దక్కించుకోవచ్చు. ఇక బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు లేకపోవచ్చు. ఓపెనర్ శుభమన్ గిల్‌ను తప్పిస్తే మయాంక్ అగర్వాల్, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేను పక్కన పెడితే కేఎల్ రాహుల్‌కు చోటు దక్కవచ్చు. రహానే గత 17 ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, అర్ద సెంచరీ తప్ప పెద్దగా రాణించలేదు. అయితే వైస్ కెప్టెన్‌ను తప్పించే సాహసం కోహ్లీ చేస్తాడా అనేది అనుమానమే.

తప్పు దిద్దుకుంటుందా?

మూడో టెస్టులో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో టెస్టులో తప్పు సరిదిద్దుకుంటుందో లేదో చూడాలి. మూడో టెస్టులో రెండోస్పెషలిస్ట్ స్పిన్నర్ లేక ఇంగ్లాండ్ జట్టు చాలా ఇబ్బంది పడింది. భారమంతా జాక్ లీచ్‌పై పడింది. అక్షర్‌తో పోల్చుకుంటే కాస్త నెమ్మదిగానే బంతులు విసిరే లీచ్ పెద్దగా ప్రభావం చూపలేదు. పార్ట్ టైమ్ బౌలర్‌గా కెప్టెన్ జో రూట్ మూడో టెస్టులో 5 వికెట్లు తీయడంతో భారత జట్టును త్వరగా ఆలౌట్ చేయగలిగారు. తొలి టెస్టులో ప్రభావం చూపించిన డామ్ బెస్‌ను లీచ్‌కు తోడుగా తీసుకునే అవకాశం ఉన్నది. ఇక బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు లేకపోవచ్చు. జో రూట్, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ మంచి ఫామ్‌లో ఉండటం ఇంగ్లాండ్ జట్టుకు కలసి వచ్చే అంశం. ఏదేమైనా ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్‌ను గెలిచి సిరీస్ డ్రా చేయాలని భావిస్తున్నది. అదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు చేరుకోదు.

తుది జట్ల అంచనా..

ఇండియా : రోహిత్ శర్మ, శుభమన్‌గిల్/మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే/కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్

ఆస్ట్రేలియా : డామ్ సిబ్లే, జాక్ క్రాలీ, జానీ బెయిర్‌స్ట్రో, జో రూట్, బెన్ స్టోక్స్, ఒల్లీ పోప్, బెన్ ఫోక్స్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, డామ్ బెస్, జేమ్స్ అండర్సన్.


Next Story

Most Viewed