దేశంలో భారీగా పెరగనున్న ద్రవ్యలోటు!

by  |
దేశంలో భారీగా పెరగనున్న ద్రవ్యలోటు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సంబంధిత పరిణామాల కారణంగా ప్రభుత్వ వ్యయం పెరగడంతో పాటు అనేక ప్రాంతాల్లో ఆంక్షల వల్ల ఆదాయం సన్నగిల్లింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ ద్రవ్యలోటు అంచనాలకు మించి భారీగా పెరిగే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సొల్యూషన్స్ శుక్రవారం తన నివేదికలో తెలిపింది. ప్రధానంగా ఆశించిన దానికంటే తక్కువగా ఆదాయం నమోదవుతుండటం దీనికి కారణమని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసిన సంగతి తెలిసిందే.

అయితే, పరిస్థితులు అనూహ్యంగా మారిపోవడం, ఊహించని విధంగా ప్రభుత్వ వ్యయాలు కూడా పెరిగిపోవడంతో ఇది ఏకంగా 8.3 శాతానికి పెరిగే అవకాశాలున్నట్టు ఫిచ్ సొల్యూషన్ వివరించింది. గతంలో ఫిచ్ అంచనాల్లో 2021-22లో ద్రవ్యలోటును 8 శాతంగా వెల్లడించింది. ఆర్థిక పునరుద్ధరణ వేగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ వ్యయం రూ. 34.8 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడి ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ. 16.5 లక్షల కోట్లు ఉండొచ్చని ఫిచ్ సొల్యూషన్స్ అభిప్రాయపడింది. ఇది ప్రభుత్వ అంచనా రూ. 17.8 లక్షల కోట్ల కంటే తక్కువ కావడం గమనార్హం.

Next Story

Most Viewed