సత్తా చాటిన రోహిత్ సేనా.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

by  |
team India
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. వరుసగా మూడో ట్వీ20లోనూ విజయం సాధించి కివీస్‌ను క్లీన్‌స్విప్ చేసింది. భారత గడ్డపై భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలిసారి రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు న్యూజిలాండ్‌పై క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.

కాగా, తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. భారత్‌ ఓపెనర్లు రోహిత్ శర్మ(56), ఇషాన్ కిషన్‌(29)లు దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం వికెట్లు వెంటవెంటనే పడడంతో మిడిలార్డర్‌లో భారత్‌ చాలా ఇబ్బంది పడింది. సూర్యకుమార్ యాదవ్ 0, రిషబ్ పంత్ 4 వికెట్లు త్వరగా పడ్డాయి. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(25), వెంకటేష్ అయ్యర్(20) మరో కీలక భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరు కూడా పెవిలియన్ చేరిన తరువాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ 1, హర్షల్ పటేల్ 18 మూడో కీలక భాగస్వామ్యాన్ని(22 పురుగులు) టీమిండియాకు అందించారు. చివర్లో దీపక్ చాహర్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌తో కివీస్ బౌలర్లపై ప్రతాపం చూపించి టీమిండియాకు భారీ స్కోరును అందించారు. దీంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

అనంతరం 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అక్షర్ పటేల్ తన తొలిబంతికే దెబ్బకొట్టాడు. మూడో ఓవర్‌లో బంతి అందుకున్న అతని బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డారియల్ మిచెల్‌(5) క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి మార్క్ చాప్‌మన్‌ (0)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఒంటరి పోరాటం చేసిన మార్టిన్ గప్తిల్(55) పరుగులు చేసి భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు. అనంతరం గప్తిల్‌ను యుజువేంద్ర చాహల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఫిలిప్స్(0), సైఫెర్ట్ (17), నీషామ్(3), సాంట్‌నర్(2), మిల్నే(7), సోది(9), ఫెర్ఘాసన్(14) వెంట వెంటనే వికెట్లు పడటంతో న్యూజిలాండ్ పీకల్లోతు వెళ్లింది. దీంతో భారత్‌కు గెలుపు సునాయాసంగా మారింది. 17.2 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 111 పరుగులకే కివీస్ పరిమితమైంది. దీంతో 73 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.



Next Story