భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదు

by  |
భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదు
X

న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి యత్నించడం తగదని, ఇది వరకు చేసిన ఈ విఫలయత్నాల నుంచి పాఠం నేర్చుకుని ఇకనైనా మానుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ చైనాకు సూచించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి పాకిస్తాన్ యత్నించగా, చైనా ఆ దేశానికి మద్దతునిచ్చింది.

అయితే, ఇతర దేశాలేవీ వీటికి మద్దతునివ్వకపోవడంతో చర్చ వీగిపోయింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను ఉపసంహరించి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే నిర్ణయం తీసుకుని సరిగ్గా ఏడాది గడిచిన తరుణంలో పాకిస్తాన్ ఈ ప్రయత్నం చేసింది. అయితే, ఈ రెండు దేశాల తీరుపై భారత్ మండిపడింది. ముఖ్యంగా చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఐరాస భద్రతా మండలిలో భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌పై చర్చను చైనా మొదలుపెట్టడాన్ని గుర్తించామని, ఇలా ప్రయత్నించడం ఇదేమీ మొదటిసారి కాదని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలోలాగే ఇప్పుడు కూడా ఈ కుయుక్తులు పారలేదని, ఈ సారి కూడా అంతర్జాతీయ సమాజం మద్దతునివ్వలేదని తెలిపింది. అంతేకాదు, ఇటువంటి ప్రయత్నాలను చైనా విరమించుకోవాలని, గతంలోని విఫల ప్రయత్నాల నుంచి పాఠం నేర్చుకుని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి యత్నించడాన్ని మానుకోవాలని సూచించింది.

Next Story

Most Viewed