భారత్‌లో 2 కోట్లు దాటిన కరోనా కేసులు

by  |
corona, india
X

న్యూఢిల్లీ : సుమారు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. భారత్‌లో మరో రికార్డును సృష్టించింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని భారత్‌లో ఇప్పటివరకు 2 కోట్ల మందికి (అధికారిక గణాంకాల ప్రకారం..) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రపంచంలో అమెరికా (3.24 కోట్లు) తర్వాత కేసులలో 2 కోట్ల మార్కును దాటిన దేశం భారతే కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,57,229 మందికి కరోనా నిర్ధారణ కాగా 3,449 మంది మరణించారు. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 2,02,82,833 కు చేరింది. ఇక మరణాల సంఖ్య 2,22,408 కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 34 లక్షలకు చేరగా ఆ రేటు 17 శాతానికి చేరి రికవరీ రేటు 81 శాతానికి పడిపోయింది.

తగ్గుతున్నా ఆందోళనకరమే..

దేశంలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈనెల 1న దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 4 లక్షలు (4,01,993) దాటిన విషయం తెలిసిందే. కాగా.. ఆ తర్వాత రోజు 3.92 లక్షల కేసులు రాగా సోమవారం 3.68 లక్షలకు తగ్గాయి. ఇక మంగళవారం అవి 3.57 లక్షలు రావడం గమనార్హం. గతనెలలో కరోనా స్వైర విహరం కొనసాగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ లోనే తొలిసారి లక్ష.. రెండు లక్షలు.. మూడు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసులలో గత మూడు రోజుల నుంచి తగ్గుదల కనిపిస్తున్నా దేశవ్యాప్తంగా దాని ఉధృతి ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మార్చి, ఏప్రిల్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, కేరళలో పాజిటివ్‌ల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కుంభమేళా నుంచి వెళ్లివచ్చిన వారిలో.. ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్ లలో ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. సోమవారం కర్నాటకలో ఏకంగా 44 వేల కేసులు రావడం గమనార్హం. ఇక సుమారు నెల రోజుల తర్వాత మహారాష్ట్రలో కరోనా కేసులు 50 వేలకు (48,621) తక్కువగా నమోదు కావడం విశేషం.



Next Story

Most Viewed