ఏడేళ్లలో రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు!

by  |
ఏడేళ్లలో రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఏడేళ్లలో భారత్ రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆకర్షించిందని వాణిజ్య, పరిశ్రమ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. మంగళవారం బహుళజాతి సంస్థలతో పరిశ్రమల సంఘం సీఐఐ నేషనల్ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణల వల్ల రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని పీయూష్ గోయల్ తెలిపారు.

భారత్ తన నాణ్యతా ప్రమాణాలను ప్రపంచంతో ఏకీకృతం చేయడంపై దృష్టి సారిస్తోందని, నిర్దిష్ట ఉత్పత్తి, దేశీయ మార్కెట్ కోసం మిగిలిన వాటి ఎగుమతుల కోసమనే ఆలోచనను విడనాడాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ‘గత ఏడేళ్లలో రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఆర్థిక కార్యకలాపాల పురోగతి భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై కాలంలో దేశంలోకి రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.

ఇది అంతకుముందు కంటే 62 శాతం అధికం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో సహా మిగిలిన వాటిపై చర్చలు కొనసాగుతున్నాయి’ అని పీయూష్ గోయల్ వివరించారు. ప్రపంచాన్ని ఆకర్షించగలిగే స్థాయిలో దేశీయంగా తయారీని చేపట్టాలని బహుళజాతి కంపెనీలకు పీయూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు.



Next Story