వాటి పై నెగెటివ్ ఔట్‌లుక్

by  |
వాటి పై నెగెటివ్ ఔట్‌లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో రవాణా, ఇంధన మౌలిక సదుపాయాల పై నెగెటివ్ ఔట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్టు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ శుక్రవారం వెల్లడించింది. ఈ రంగాల్లో డిమాండ్ క్షీణించిన నేపథ్యంలో ప్రతికూల దృక్పథం అలాగే కొనసాగుతోందని రేటింగ్స్ ఏజెన్సీ పేర్కొంది. రోడ్లు, విమానాశ్రయ రంగాల పై కూడా రేటింగ్స్ ఏజెన్సీ ప్రతికూల దృక్పథాన్ని కొనసాగించింది. ఈ నెల మొదటి 15 రోజుల్లో టోల్ వసూళ్లు కొవిడ్-19 ముందు స్థాయిలో 90 శాతం తిరిగొచ్చాయని, ఇది ఏప్రిల్‌లో ఇండియా రేటింగ్స్ అంచనాల కంటే అధికమని తెలిపింది.

అయితే, ప్రాంతీయంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ ఆంక్షలు, కొవిడ్-19 వ్యాప్తి పెరుగుదల, ప్రయాణాల్లో ఉన్న పరిమితులు, ప్రజల జీవనంలో మార్పులు, బలహీనమైన ఆర్థిక పునరుద్ధరణ కారణాలతో వృద్ధి నెమ్మదిగా ఉండొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో విమానాశ్రయ రంగం బలహీనపడింది. అయితే, దీర్ఘకాలిక సామర్థ్యం చెక్కుచెదరకుండా ఉందని ఏజెన్సీ పేర్కొంది.

అలాగే, ఇంధన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి రేటింగ్స్ సంస్థ నివేదిక.. డిస్కమ్‌లకు ద్రవ్యత పెంపు ప్రభావం తాత్కాలికమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి డిస్కమ్‌ల చెల్లింపులు పెరిగే అవకాశముందని, చాలా డిస్కమ్‌ల బలహీనమైన నిర్వహణ ఈ రంగం నెగెటివ్ ఔట్‌లుక్‌ను కొనసాగించేలా చేస్తున్నాయని రేటింగ్ సంస్థ తెలిపింది. ఇక, కమర్షియల్ ట్రాఫిక్ విభాగం టోల్ వసూళ్లలో 75-80 శాతం రికవరీ ఉందని, మిగిలినవి ప్యాసింజర్ వాహనాల నుంచి వస్తాయని పేర్కొంది. ఆరు నెలల మారటోరియం ఆగస్టులో ముగియడం, టోల్ వసూళ్ల రికవరీతో ఈ రంగంలోని ప్రాజెక్టులలో ఒత్తిడి తగ్గొచ్చని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.


Next Story