ఆకలి సూచీలో అథమ స్థానంలో భారత్

by  |
ఆకలి సూచీలో అథమ స్థానంలో భారత్
X

దిశ, వెబ్ డెస్క్: ఆకలి సూచీలో భారత్ మళ్లీ అథమ స్థానంలోనే నిలిచింది. 107 దేశాల జాబితాలో మనదేశం 94వ స్థానంలో ఉన్నది. సీరియస్ కేటగిరీలోకి చేరింది. మనకంటే కేవలం 13 దేశాలు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. పొరుగు దేశాలూ మనకంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. నేపాల్(73), శ్రీలంక(64)లు మరింత ముందంజలో ఉండి సాధారణ జాబితాలో స్థానాలను పొందాయి.

బంగ్లాదేశ్(75), మయన్మార్(78), పాకిస్తాన్‌(88)లూ సీరియస్ కేటగిరీలో ఉన్నప్పటికీ మనకంటే మెరుగ్గా ఉండటం గమనార్హం. కేవలం అఫ్ఘనిస్తాన్(99) మాత్రమే మనకన్నా వెనుకబడి ఉన్నది. తాజా ఆకలి సూచీలో 27.2 స్కోరుతో ఇండియా సీరియస్ కేటగిరీ జాబితాలోకి చేరింది. భారత్ 2000లో 38.9, 2006లో 37.5, 2012లో 29.3 స్కోరును కలిగి ఉంది. తాజాగా, స్కోరులో కాస్త మెరుగుపడినప్పటికీ పొరుగుదేశాలు మనకంటే ముందుకు దూసుకెళ్లాయి. గతేడాది 117 దేశాల జాబితాలో భారత్ 102వ స్థానంలో నిలిచింది.

2018లో 119 దేశాల జాబితాలో భారత్ 103వ స్థానంలో నిలిచింది. సాధారణంగా ఆకలి సూచీలో ‘0’ స్కోరు ఉంటే అత్యంత మెరుగైన దేశంగా, 100 స్కోరుంటే తీవ్ర ఆకలి సమస్య ఉన్నట్టుగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన ఎన్జీవో వెల్త్ హంగర్ లైఫ్‌లు సంయుక్తంగా ఈ రిపోర్టును ప్రచురిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యను రీజియన్, దేశం, ప్రాంతీయ స్థాయిలో వెల్లడించేలా ఈ జాబితాను రూపొందిస్తున్నాయి.


Next Story