సెమీకండక్టర్ల కోసం రూ. 76 వేల కోట్ల ప్రోత్సహకాలందించే యోచనలో కేంద్రం!

by  |
chip
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు కేంద్రం వచ్చే ఆరేళ్లలో 20 సెమీకండక్టర్ డిజైన్, కాంపొనెంట్ల తయారీ, డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించనుంది. దీనికి సంబంధించి ఈ ప్రోత్సాహకాల విలువ రూ. 76,000 కోట్లుగా ఉండొచ్చని కేంద్రం భావిస్తోంది. వివిధ పీఎల్ఐ పథకాల ద్వారా భారత్‌ను తయారీతో పాటు ఎగుమతుల పరిధిని విస్తరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. సెమీకండక్టర్ తయారీ ప్రోత్సాహకాలతో భారత్ తయారీ కేంద్రంగా నిలుస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీ కోసం 2 కేంద్రాలతో పాటు కాంపొనెంట్ల తయారీ, సెమీకండక్టర్ల తయారీ నిమిత్తం 20 యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఈ పథకం ఆమోదం కోసం త్వరలో కేబినెట్ సమావేశంలో విధివిధానాలను రూపొందించనున్నారు. ఇటీవల చిప్‌ల కొరత వల్ల దేశీయంగానే కాకుండా ప్రపంచ మార్కెట్ సైతం దాదాపు అన్ని పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రభావితమైంది. ప్రస్తుతం ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులోనూ సెమీకండక్టర్ల వినియోగం పెరిగిన సమయంలో కొరత ఏర్పడింది. ఈ సమయంలో ఎలక్ట్రానిక్ ప్రోత్సాహానికి కేంద్ర నిర్ణయం తీసుకోవడం సానుకూల విషయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.



Next Story

Most Viewed