ఆ టీకాల కోసం రెండేళ్లు ఆగాల్సిందేనా?

by  |
ఆ టీకాల కోసం రెండేళ్లు ఆగాల్సిందేనా?
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుంచి 18 ఏళ్లు పైబడినవారిని టీకాకు అర్హులను ప్రకటిస్తూనే విదేశీ టీకాలకు అనుమతించే ప్రక్రియను సరళతరం చేసింది. కానీ, ప్రభుత్వం ఆశించినట్టుగా విదేశీ కంపెనీలు ముందుకు రాకపోవడంతో టీకా పంపిణీ అవాంతరాలను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా ఫైజర్, మొడెర్నా టీకాలు మనదేశానికి రావడానికి మరో రెండేళ్లు పట్టేలా ఉంది. 2023 వరకు ఈ కంపెనీలు యూరప్ సహా ఇతరదేశాలకు కమిట్‌మెంట్లు ఇచ్చి ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ ఆలస్యంగా చేరింది. దీంతో కమిట్ అయిన ఆర్డర్‌లను అందిస్తూ కంపెనీలు అదనంగా ఉత్పత్తి చేస్తేనే భారత్‌కు ఆ టీకాలు అందే స్థితి ఉన్నది.

మరోరకంగా చెప్పాలంటే 2023 వరకు మనదేశానికి ఈ రెండు టీకాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలురాష్ట్రాలు ఈ కంపెనీలను ఆశ్రయించి భంగపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం వీటితో సంప్రదింపులు జరుపుతున్నా.. ఫలితం తేలేదెప్పుడో తెలియట్లేదు. కాగా, కేంద్ర విదేశాంగ శాఖ ఎస్ జైశంకర్ మాత్రం ప్రస్తుతం అమెరికాలో టీకాలపై సంప్రదింపుల్లో బిజీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఫైజర్, మొడెర్నా కంపెనీల ఆర్డర్లు ఫుల్‌గా ఉన్నాయని, వాటి అదనపు ఉత్పత్తిపైనే భారత్‌కు సరఫరా ఆధారపడి ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కూడా. టీకా పంపిణీలో జాప్యం నెలకొనడంతో లాక్‌డౌన్ ఫలాలు చేజారిపోయేలా ఉన్నాయి. ఫిబ్రవరి 3 నుంచి మే 24 వరకు మనదేశంలో కరోనాతో 1,49,017 మంది, లేదా మే 1 నుంచి 95,390 మంది మరణించడం గమనార్హం.

అప్పుడు తిరస్కరణ.. ఇప్పుడు ఎదురుచూపులు

భారత్‌కు టీకా సరఫరాకు ఫైజర్ ప్రభుత్వం గతేడాది చివరిలోనే ప్రయత్నించింది. దరఖాస్తూ చేసుకుంది. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఫైజర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. అత్యవసర వినియోగ అనుమతిని నిరాకరించింది. దీంతో ఫైజర్ తన దరఖాస్తును ఉపసంహరించుకుంది. కానీ, ఏప్రిల్ కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుని ఫేజ్2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌పై కండీషన్స్ పెట్టబోమని, యూఎస్, ఈయూ, యూకే రెగ్యులేటర్లు ఆమోదించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ లిస్టులోని కంపెనీల టీకాలకు అనుమతినివ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. కానీ, ఫైజర్ మళ్లీ భారత్‌ను ఆశ్రయించలేదు. కేంద్ర ప్రభుత్వమే ఈ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నా.. ఫలితం సకాలంలో తేలేలా లేదు.



Next Story

Most Viewed