చారిత్రాత్మక గరిష్ఠాలకు చేరువలో భారత వస్తువులు, సేవల ఎగుమతులు!

by  |
చారిత్రాత్మక గరిష్ఠాలకు చేరువలో భారత వస్తువులు, సేవల ఎగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థికవ్యవస్థ అన్ని రంగాల్లో తిరిగి పుంజుకుంటోందని, వస్తువులు, సేవల ఎగుమతుల్లో చారిత్రాత్మక గరిష్ఠాలను సాధించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో భారత్ 400 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 30 లక్షల కోట్ల) విలువైన వస్తువుల ఎగుమతులను సాధించే దిశగా పయనిస్తోందని ఆదివారం ఓ కార్యక్రమంలో అన్నారు. అలాగే, 150 బిలియన్ డాలర్ల(రూ. 12 లక్షల కోట్ల) విలువైన సేవల ఎగుమతులను చేరుకుంటుందని, ఈ లక్ష్యాలు సాధించగానే భారత్ చారిత్రాత్మక వస్తువులు, సేవల ఎగుమతుల రికార్డును సాధిస్తుందని ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్(ఐఐటీఎఫ్) ప్రారంభ సమావేశంలో పీయూష్ గోయల్ చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 27 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్ల) ఎఫ్‌డీఐ నిధులను సాధించింది. ఇది గతంతో పోలిస్తే 62 శాతం పెరిగిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గ్లోబల్ సరఫరా వ్యవస్థను నిర్వహించడంలో ప్రపంచం భారత్‌ను నమ్ముతోందని, లాక్‌డౌన్ పరిస్థితుల్లోనూ ప్రపంచానికి సేవల ఎగుమతులతో కీలక మద్దతు భారత్ అందించిందన్నారు. భారత్ పరిశ్రమలు, సేవలకు గ్లోబల్ సెంటర్‌గా మారనుంది. నాణ్యత, పోటీతత్వం, ఆర్థిక ప్రమాణాల్లో కొత్త శిఖరాలను చేరుకుంటుంది. ‘లోకల్ గోస్ గ్లోబల్’, ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ లక్ష్యాలను సాకారం చేయడంలో ఐఐటీఎఫ్ ఎంతో దోహదపడుతుందని పీయూష్ గోయల్ తెలిపారు.



Next Story