2020లో భారతీయ కంపెనీల లాభం 569 శాతం..

by  |
2020లో భారతీయ కంపెనీల లాభం 569 శాతం..
X

దిశ, వెబ్‌డెస్క్ : 2020 క్యాలెండర్ ఏడాదిలో కరోనా కారణంగా దేశీయంగా అనేక రంగాలు కుప్పకూలాయి. ఏడాది ప్రారంభం నుంచే పరిశ్రమలు నష్టాలను ఎదుర్కొన్నాయి. కొన్ని రంగాలు మాత్రం మొదట్లో నష్టపోయినప్పటికీ తర్వాత పుంజుకున్నాయి. దేశీయ కంపెనీలు అనేకం కరోనాను దృష్టిలో ఉంచుకుని ఖర్చులను తగ్గించడంతో ఈ ఏడాది రెండో భాగంలో అత్యధిక లాభాలను దక్కించుకున్నాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను వెల్లడించిన 4,234 లిస్టెడ్ కంపెనీల నుంచి సేకరించిన వివరాలను సీఎంఐఈ విశ్లేషించింది. లాక్‌డౌన్ సమయంలో కంపెనీలు ముడిసరుకు వినియోగం, నిర్వహణ వ్యయాలను భారీగా తగ్గించాయి.

వేతనాలను 3.4 శాతం వరకు పెంచినా, ఇతర ఖర్చులను 9 శాతం వరకు తగ్గించాయి. వార్షిక ప్రాతిపదికన ఈ లిస్టెడ్ కంపెనీల వృద్ధి 568.5 శాతంగా నమోదైందని సీఎంఐఈ పేర్కొంది. 2018, మార్చి లాభాల్లో 98 శాతం ప్రతికూల వృద్ధి నమోదు కాగా, 2019, మార్చిలో 356 శాతం వృద్ధిని సాధించాయి. అయితే, ఆ తర్వాత సెప్టెంబర్ త్రైమాసికంలో 90 శాతానికి పడిపోయాయి. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాదికి లాభాలను పరిశీలిస్తే దాదాపు 569 శాతం పెరిగాయని, ఈ పెరుగుదల అసాధారణమని సీఎంఐఈ తెలిపింది. కార్పొరేట్ కంపెనీల ఖర్చుల్లో వేతనాలు 7-10 శాతంగా ఉన్నాయని సీఎంఐసీ వెల్లడించింది.



Next Story

Most Viewed