అంతర్జాతీయ విమానాలపై మరో నెల..

by  |
అంతర్జాతీయ విమానాలపై మరో నెల..
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని మరో నెలరోజులపాటు పొడిగించింది. ఆగస్టు 31 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. కార్గో విమానాలు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అనుమతి పొందిన విమానాలపై ఈ ఆంక్షలు ఉండబోవని పేర్కొంది.

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి అంతర్జాతీయ విమానాలపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. చివరిసారిగా జులై 15 నుంచి 31వరకు ఈ నిషేధాన్ని పొడిగించింది. తాజాగా, అన్‌లాక్ 2.0 జులై 31తో ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్ 3.0 కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జులై 31 తర్వాత విమానయానంపై ఉత్తర్వులు విడుదల చేసింది.

ఈ ప్రకటనతోపాటు కరోనా లాక్‌డౌన్‌లతో పలుదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి విమానాల్లో తీసుకొస్తున్న విషయాన్నీ గుర్తుచేసింది. సుమారు 2,500 విదేశీ క్యారియర్లు చిక్కుకుపోయిన కార్మికులను తరలించాయని, వందే భారత్ కింద ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు 2,67,436మంది ప్రయాణికులను, ఇతర చార్టర్లు 4,86,811 మంది ప్యాసింజర్లను స్వదేశానికి తరలించాయని ప్రభుత్వం వెల్లడించింది. యూఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీలతో ట్రాన్స్‌పోర్ట్ బబుల్ అగ్రిమెంట్ కుదిరిందని తెలిపింది. ఇరుదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశాలకు తరలించడానికి కువైట్‌తోనూ భారత్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం చేసుకున్నదని వివరించింది.


Next Story

Most Viewed