ఐరాస భద్రతామండలి సభ్యదేశంగా భారత్

by  |
ఐరాస భద్రతామండలి సభ్యదేశంగా భారత్
X

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇండియాతోపాటు మెక్సికో, ఐర్లాండ్, నార్వే దేశాలూ ఈ మండలికి బుధవారం ఎన్నికయ్యాయి. కాగా, ఆఫ్రికా దేశాలకు సంబంధించిన ఐదో సీటుకు ఎన్నిక జరగనుంది. ఈ సీటుకు కెన్యా, జిబౌటీ దేశాలు పోటీపడుతున్నాయి.

అయితే, ఈ మండలిలో భారత్ ఎన్నిక అనూహ్యమైందేమీ కాదు. ఆసియా-పసిఫిక్ కేటగిరీలో ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశ(2021-22) ఎన్నికలకు భారత్ సింగిల్‌గా పోటీ చేసింది. ఆసియా-పసిఫిక్ గ్రూప్‌లోని చైనా, పాకిస్తాన్ సహా 55 దేశాలు గతేడాదే భారత్‌కు సమ్మతిని ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు భారత్ ఏడుసార్లు ఎన్నికవ్వగా తాజాగా, ఎనిమిదో సారి భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది.

ఈ ఎన్నికపట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ను ఎన్నుకున్నందుకు అంతర్జాతీయవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. విశేష అధికారాలుండే భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం రెండేళ్లపాటు ఉంటుంది. దేశాలపై ఆంక్షలు విధించడం, బలగాల మోహరింపునకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ మండలిలోనే జరుగుతాయి. ఇందులో ఐదు శాశ్వత దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలు వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. కాగా, పది తాత్కాలిక సభ్యదేశాలుంటాయి.



Next Story

Most Viewed