అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి: త్రైపాక్షిక భేటీలో ఎస్ జైశంకర్

by  |
అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి: త్రైపాక్షిక భేటీలో ఎస్ జైశంకర్
X

న్యూఢిల్లీ: ఏ దేశమైనా అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, భాగస్వామ్య దేశాల చట్టబద్ధ ప్రయోజనాలను గుర్తించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత భారత్‌కు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని, ఆ తప్పును సరిదిద్దాలని తెలిపారు. రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో మంగళవారం మనదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. చైనాతో సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీలో ఇరుదేశాల మంత్రులు పాల్గొనడం గమనార్హం. రెండో ప్రపంచయుద్ధంలో విజయోత్సవాలను రష్యా జరుపుకుంటున్న రోజే ఈ సమావేశం జరిగింది. భారత్, చైనా దేశాల మంత్రులు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

నాయకత్వ స్థాయి దేశాలు ఆదర్శంగా నిలవాలి: జైశంకర్

ఇవాళ ఎదురవుతున్న సవాళ్లు ప్రస్తుత పద్ధతులు, నిబంధనల వల్లనే కాదు, ఆయా దేశాలు అమలుచేస్తున్న నిర్ణయాల వల్ల కూడా తలెత్తుతున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. ప్రపంచంలో ‘నాయకత్వ స్థాయిలో ఉన్నదేశాలు’ మిగతాదేశాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. అవి అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని సూచించారు. భాగస్వామ్య దేశాల చట్టబద్ధ ప్రయోజనాలు గుర్తించాలని పరోక్షంగా చైనాపై ఆ దేశ మంత్రి సమక్షంలోనే కామెంట్ చేశారు. అలాగే, గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా మల్టిలేటరిలిజాన్ని ప్రోత్సహించాలని, అన్ని దేశాల ప్రయోజనాలకు అనుగుణమైన అడుగులు వేయాలని సూచించారు.

మూడు దేశాల మంత్రుల ప్రారంభ వచనాలు లైవ్ టెలికాస్ట్ అయ్యాయి. కానీ, తర్వాత మళ్లీ ‘క్లోజ్డ్ డోర్’ మీటింగ్‌లాగే సాగింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రెండో ప్రపంచయుద్ధంలో భారత పాత్రను గుర్తుచేస్తూ తన చర్చను ప్రారంభించారు. యాక్సిస్ పవర్స్(జర్మనీ, ఇటలీ, జపాన్ వర్గం)పై ఆలిస్ వర్గం గెలవడంలో చైనా, రష్యాలతోపాటు భారత సైన్యమూ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. భారత్‌కు చెందిన 23లక్షల ట్రూపులు ఈ యుద్ధంలో పాల్గొన్నాయని గుర్తుచేశారు. పర్షియన్ కారిడార్, హిమాలయన్ హంప్ ద్వారా రెండు కీలకమైన సప్లై లైన్‌లను రష్యా, చైనాల కోసం అప్పుడు(అప్పటి బ్రిటీష్ ఇండియా) తెరిచే ఉంచామని తెలిపారు. ప్రస్తుతం మాస్కోలో రెండో ప్రపంచయుద్ధంలో విజయం సందర్భంగా జరుగుతున్న పరేడ్‌ తామంతా కలిసి సాధించిన లక్ష్యమని అన్నారు.

సంబంధాలను కాపాడుకోవాలి: చైనా మంత్రి

కాగా, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా భారత్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చైనా, భారత్, రష్యాలు పరస్పర ప్రయోజనాల కోసం పాటుపడాలని, భాగస్వామ్య దేశాల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఏవైనా సున్నిత సమస్యలు తలెత్తినప్పుడు ద్వైపాక్షిక సంబంధాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మూడు దేశాల మధ్యనున్న సంబంధాలను కాపాడుకోవాలని తెలిపారు. కాగా, భారత్, చైనా మధ్య మధ్యవర్తి్త్వం వహిస్తుందన్న వాదనలను కొట్టిపారేస్తూ రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయ్ లావరోవ్, ఆ రెండు దేశాలే వాటిని పరిష్కరించుకుంటాయని అన్నారు. వారి సమస్యల మధ్యలోకి దూరాల్సిన కారణమేమీ తమకు కనిపించడం లేదని తెలిపారు.

Next Story