‘పాక్ హైకమిషన్‌లో సిబ్బందిని సగానికి తగ్గించండి’

by  |
‘పాక్ హైకమిషన్‌లో సిబ్బందిని సగానికి తగ్గించండి’
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న పాక్ ఉద్యోగులు, సిబ్బందిని 50శాతం తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ పాకిస్తాన్ చార్జ్ డీ’ఎఫైర్స్‌కు నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. భారత్‌లో ఉన్న పాక్ సిబ్బంది గూఢచర్యానికి పాల్పడటమే కాకుండా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. మే 31న ఇద్దరు పాక్ సిబ్బంది గూఢచర్యం చేస్తూ పట్టుబడడమే ఇందుకు నిదర్శనమనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఇదే క్రమంలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పనిచేసే భారత ఉద్యోగులనూ 50శాతం తగ్గించుకుంటామని పాక్‌కు వెల్లడించింది. భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న భారత ఉద్యోగులను అక్కడి అధికారులు, పోలీసులు వేధిస్తున్నారని పేర్కొంది. అక్రమంగా అరెస్టులు చేసి గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డామని ఒప్పుకోవాలని ఒత్తిళ్లు తెస్తోందనీ, అందుకే ఇరువైపులా ఉద్యోగులను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది.

Next Story