కుర్రాళ్లకు తొలి పరీక్ష శ్రీలంకతో వన్డే

by  |
కుర్రాళ్లకు తొలి పరీక్ష శ్రీలంకతో వన్డే
X

దిశ, స్పోర్ట్స్: రోహిత్, కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు లేరు.. మిడిల్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించే పంత్, అయ్యర్ గైర్హాజరి, మహ్మద్ షమీ, బుమ్రా వంటి స్పెషలిస్టు బౌలర్లు కూడా అందుబాటులో లేరు. ఒకవైపు టీమ్ ఇండియా ప్రధాన జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ కోసం పర్యటిస్తుండగా.. శిఖర్ ధావన్ నేతృత్వంలోని కుర్రాళ్ల జట్టు శ్రీలంకకు వచ్చింది. బీ టీమ్ అని.. థర్డ్ గ్రేడ్ టీమ్ అంటూ పలు విమర్శలు వచ్చినా.. తాము సీనియర్లకు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించుకునే సమయం కుర్రాళ్లకు వచ్చింది. తనలోనూ నాయకత్వం లక్షణాలు ఉన్నాయని.. జట్టును విజయవంతంగా నడిపించగలనని శిఖర్ ధావన్ కూడా సెలెక్టర్లకు చాటి చెప్పుకునే సందర్భం రానే వచ్చింది. శ్రీలంక పర్యటన కోసం ముంబైలో క్వారంటైన్ అయిన దగ్గర నుంచి ఆదివారం తొలి వన్డే ఆడటానికి మధ్యలో 31 రోజులు గడిచిపోయాయి. ఇందులో నాలుగైదు రోజులు మినహా ఎక్కువగా బయోబబుల్‌కే పరిమితం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక జట్టును వారి హోం గ్రౌండ్‌లో ఓడించడానికి ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్ హెల్త్ కూడా ముఖ్యమే. మరి కుర్రాళ్లు ఈ తొలి పరీక్ష పాస్ అవుతారా? మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేలో విజయం సాధిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బ్యాటింగే బలం..

భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో బ్యాటింగ్ చాలా బలంగా ఉన్నది. వన్డేల్లో విజయవంతమైన ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్ బ్యాటింగ్‌ను ముందుండి నడిపించాలి. 2021లో ధావన్ మూడు వన్డేలు ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ధావన్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. రెండు అర్దశతకాలు నమోదు చేసిన ధావన్ అత్యధికంగా 98 పరుగులు చేశాడు. ధావన్ మరో 23 పరుగులు చేస్తే 6 వేల పరుగుల క్లబ్‌లో జాయిన్ అవుతాడు. ధావన్‌కు తోడుగా పృథ్విషా ఓపెన్ చేస్తాడని టీమ్ ఇండియా యాజమాన్యం ఇప్పటికే తెలిపింది. పృథ్వీషా ఇటీవల దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్, మనీష్ పాండేలను తీసుకునే అవకాశం ఉన్నది. మనీష్ పాండేకు ఇంతకు ముందే వన్డేలు ఆడిన అనుభవం ఉన్నది. ఆల్‌రౌండర్లు పాండ్యా బ్రదర్స్‌కు కూడా చోటు దక్కవచ్చు. అయితే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్‌లో ఎవరికి దక్కుతుందనే అనుమానం ఉన్నది. వీరిద్దరు కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న వాళ్లే. ఇటీవల ఐపీఎల్‌లో ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారు.

అనుభవం కలిగిన బౌలర్లు..

కుర్రాళ్లతో కూడిన బీ టీమ్ అని అంటున్నా.. బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా కనిపిస్తున్నది. వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్నాడు. అతడికి సుదీర్ఘ క్రికెట్ అనుభవం ఉన్నది. ఉపఖండం పిచ్‌లపై మంచి స్వింగ్ చేయగల సత్తా ఉన్నది. అతడికి తోడు దీపక్ చాహర్ లేదా నవదీప్ సైనిలకు చోటు దక్కవచ్చు. ఇక మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి హార్దిక్ పాండ్యా సహకారం ఉంటుంది. రెండేళ్ల తర్వాత స్నిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ఓకే మ్యాచ్‌లో చూసే అవకాశం ఉన్నది. వీరిద్దరికీ మంచి క్రికెట్ అనుభవం ఉండటం కలసి వచ్చే అంశం.

శ్రీలంకతో జరిగే అన్ని మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో బంతి స్వింగ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. కానీ ఆ సమయంలో బ్యాటింగ్ చేయడం పెద్దగా ఇబ్బందిగా ఉండదని పిచ్ క్యురేటర్ చెబుతున్నాడు.

శ్రీలంక జట్టు ఇటీవల ఇంగ్లాండ్‌లో పర్యటించి వన్డే, టీ20 సిరీస్ ఓడిపోయింది. ఆ జట్టు కెప్టెన్, బ్యాటింగ్‌కు వెన్నెముక వంటి కుషాల్ పెరీర లేకపోవడం పెద్ద లోటు. భుజం గాయం కారణంగా అతడు సిరీస్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు.

రికార్డు : మొత్తం ఆడిన వన్డేలు – 159, ఇండియా – 91, శ్రీలంక – 56, నో రిజల్డ్ – 11, టై – 1

శ్రీలంకలో : ఆడినవి – 61, శ్రీలంక – 27, ఇండియా – 28, నో రిజల్డ్ – 6

ఇరు జట్ల అంచనా

శ్రీలంక : అవిష్క ఫెర్నాండో, పాథుమ్ నిస్సంన్కా, భనూక రాజపక్స, వాయిందు హసరంగ, ధనంజయ డిసిల్వ, దాసన్ షనక (కెప్టెన్), మినోద్ భనుక (వికెట్ కీపర్), లాహిరు కుమార, ఇరుసు ఉదాన, అకిల ధనంజయ లేదా లక్షన్ సందకన్, దుశ్మంత చమీర

ఇండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్, మనీష్ పాండే, సంజూ శాంసన్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల పాండ్యా, దీపక్ చాహర్/నవదీప్ సైనీ, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్

మ్యాచ్ : ఇండియా Vs శ్రీలంక తొలి వన్డే
వేదిక : ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో
సమయం : మధ్యాహ్నం 3.00 గంటల నుంచి
లైవ్ : సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లివ్

Next Story