ఐటీ రిటర్నును మూడు నెలలు పొడిగించిన ప్రభుత్వం..

by  |
tax
X

దిశ, వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరటనిచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గుడువును పొడిగించింది. ప్రస్తుతం ఉన్న సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు మూడు నెలలు పోడిగిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. కొత్త ఆదాయ పన్ను పోర్టల్‌లో లోపాల కారణంగానే ఈ గడువును పొడిగిస్తున్నామని సీబీడీటీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ దాఖలు చేసే గడువును ప్రభుత్వం పొడిగించడం ఇది రెండోసారి. ఇదివరకు కొవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఐటీఆర్ దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెండు నెలలు పొడిగించింది. దీంతో పాటు ఆలస్యమైన లేదా సవరించిన ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువును జనవరి 31, 2022 నుంచి మార్చి 31, 2022 వరకు రెండు నెలలు పోడిగించింది.

పన్ను చెల్లింపులకు సంబంధించి కేంద్రం ఇటీవల కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది ప్రారంభమైన రోజు నుంచే సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడంలో కొత్త కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఫిర్యాదులు సైతం ఎక్కువయ్యాయి. అంతేకాకుండా కొంతమంది పన్ను చెల్లింపుదారులు జూలై 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినప్పుడు వడ్డీ, ఆలస్య రుసుము వసూలైనట్టు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఆర్థిక శాఖ పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారుల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం ఐటీఆర్ దాఖలు గడువును మూడు నెలలు పొడిగించింది.

Next Story