‘ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సహక నిధులివ్వండి’

by  |
‘ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సహక నిధులివ్వండి’
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయితీలకు విడుదల చేయాల్సిన రూ.10 లక్షల గ్రాంటును వెంటనే విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళి‌సై సౌందర రాజన్‌కు శనివారం ఆయన వినతిపత్రం అందించారు. అనంతరం పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. 2019లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలను పురస్కరించుకుని అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్న రూ.5 లక్షల గ్రాంటును రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించినట్టు గుర్తు చేశారు. అంతేగాకుండా, అదనంగా మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.15 లక్షలను ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే చాలా వరకూ మారుమూల ప్రాంతాలు, గిరిజన తదితర నిధులు లేని గ్రామ పంచాయితీలకు ప్రోత్సాహక గ్రాంటు వరంగా ఉండేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,680 గ్రామ పంచాయితీలకు 1935 గ్రామ పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయని అన్నారు. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాషాగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా 2019లో రాళ్లు కొట్టుకుని జీవించే షేక్ అజారుద్దీన్‌ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అన్నారు. గ్రామంలో ప్రోత్సాహక నిధులు మంజూరు అవుతాయానే ధీమాతో గ్రామంలో చెట్లు పెంపకం, వైకుంఠదామం, డంప్ యార్డు వంటి పనులను అప్పుు చేసి సర్పంచ్ షేక్ అజారుద్దీన్ నిర్వహించాడని అన్నారు. అయితే ఆ నిధులు రాకపోవడంతో భార్య నగలు తాకట్టు పెట్టిన కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చేసుకోవడంతో.. విధిలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ తరహాలోనే రాష్ట్రంలోని ఏకగ్రీవమైన గ్రామ పంచాయితీలు, గిరిజన గ్రామ పంచాయితీ ప్రోత్సాహక నిధులు వస్తాయని అభివృద్ది కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తం రూ.25 లక్షల చొప్పున నిధులను ఏకగ్రీవమైన గ్రామ పంచాయితీలకు మంజూరు చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని పద్మనాభరెడ్డి గవర్నర్ ను కోరారు.


Next Story

Most Viewed