ఆ భయంలోనే సీఎం కేసీఆర్ ఎన్నికలు వాయిదా వేసిండు : విజయశాంతి

by  |
ఆ భయంలోనే సీఎం కేసీఆర్ ఎన్నికలు వాయిదా వేసిండు : విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నిక ఎప్పుడు వచ్చినా హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు, టీఆర్ఎస్ ఓటమి ఖాయమని బీజేపీ సీనియర్ నాయకులు విజయశాంతి జోస్యం చెప్పారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు చేసిన, చేస్తున్న అరాచక కార్యాచరణ వల్ల టీఆర్ఎస్ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నైతిక ఓటమి పాలైందన్నారు. ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంసిద్ధతపై ప్రశ్నిస్తే తమ వల్ల కాదని కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుని మంచి గాలప్ మీద భాగ్ మిల్కా లెక్క ఉరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు.

గతంలో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినకుండా మిలియన్ల సంఖ్యలో ఓటర్లు పాల్గొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించిన ఈ సీఎం… ఇప్పుడు కేవలం 100కు పైన ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు చెయ్యవలసిన ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పించుకుని వాయిదా వేసే ప్రయత్నం కేవలం హుజురాబాద్ ఎన్నిక వస్తుందన్న భయంతో మాత్రమే అని దుయ్యబట్టారు. ఇంకా సమయం దొరికితే మరిన్ని మోసపు పథకాలు తెచ్చి, నాయకులను కొనుగోలు చేస్తారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను ఒత్తిళ్లకు గురి చేసే విధంగా కేసులు, వేధింపులతో ప్రజలను భయభ్రాంతులను చేసి, ఎలాగైనా గెలవాలన్న దుర్మార్గపు ఆలోచనలో భాగంగానే ఈ పలాయనవాదాన్ని ప్రస్తుతానికి అడ్డు పెట్టుకున్నట్లుందని ఆరోపించారు. ఈ పనులన్నీటితో ఇప్పటికే జనం దృష్టిలో తేలికైపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత నవ్వుల పాలు కాక తప్పదని విజయశాంతి తెలిపారు.


Next Story

Most Viewed