తెలంగాణలో రూ.8వేల కోట్ల బకాయిలు

by  |
తెలంగాణలో రూ.8వేల కోట్ల బకాయిలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశం మొత్తం మీద ఆదాయపు పన్నును సకాలంలో చెల్లించకుండా పేరుకుపోయిన బకాయిలు సుమారు రూ. 4.82 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేసిన ఐటీ శాఖ తెలంగాణలో అది సుమారు రూ. 8000 కోట్లు ఉండొచ్చని లెక్కలేసింది. అలాంటి బకాయిలను ఈ నెల 31వ తేదీలోగా చెల్లించినట్లయితే ఎలాంటి పెనాల్టీ వేయబోమని, ఆ తర్వాత వేసే పెనాల్టీ నుంచి మినహాయింపు పొందాలంటే ‘వివాద్ సే విశ్వాస్’ పథకం కింద లబ్ధి పొందాలని ఆదాయపు పన్ను చీఫ్ కమర్షియల్ కమిషనర్ జేబీ మహాపాత్ర వ్యాఖ్యానించారు. దీనికి తోడు వారిపై ఉన్న కోర్టు కేసుల్ని కూడా ఉపసంహరించుకోడానికి వెసులుబాటు ఉంటుందన్నారు.

ఒకవైపు యశోదా ఆసుపత్రులపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్న సమయంలో మీడియాతో ఆయన పై విధంగా మాట్లాడడం గమనార్హం. ఆదాయపు పన్ను రిటన్‌లకు సంబంధించి ఉన్న వివాదాల పరిష్కారం కోసం బకాయిలను చెల్లించడం ఉత్తమమైన అవకాశమని నొక్కిచెప్పారు. ఈ నూతన పథకంపై అవగాహన కలిగించడానికి ప్రత్యేకంగా వ్యాన్‌లను కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఉన్న ఐటీ రిటన్ బకాయిలు, దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లు తదితరాలన్నింటికీ ఈ నెల 31 లోపు పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. వివాదాల్లాంటివి వచ్చే ఏడాది మార్చి 31కల్లా పరిష్కారమవుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ నెల 31 లోపు ఐటీ డిక్లరేషన్ ఇచ్చినవారికే ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా కూడా ఐటీ డిక్లరేషన్ ఇవ్వొచ్చన్నారు.

Next Story

Most Viewed