రాలుతున్న కౌలు రైతులు.. ఏడేళ్లలో 480 మంది బలి

by  |
tenant farmers suicide
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కాలం, సమయంతో సంబంధం లేకుండా ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతు బతుకు చిధ్రమౌతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక కష్టపడి వ్యవసాయం చేసే రైతును గుర్తించేందుకు మనసు ఒప్పుకోవడం లేదు. వందల ఎకరాల భూములుండి సాగు చేయలేని భూ యాజమానులనే రైతులుగా చూస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేకమంది భూ స్వాములున్నప్పటికీ వ్యవసాయం తెలియని వాళ్లు లక్షల మంది ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంటి పక్కనే పదుల సంఖ్యలో ఎకరాల భూమి ఉన్న భూస్వాములకు వ్యవసాయం చేయడం రావడం లేదు. వీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వివిధ రంగాల్లో స్థిరపడి జీవిస్తున్నారు. ఇలాంటి వాళ్ల భూమిని సేద్యం చేస్తూ ఆహార ఉత్పత్ప్తులను పెంచుతున్న వాళ్లే కౌలు రైతులు. వీళ్ల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దారుణంగా మారిపోయింది. పండించే పంటకు గిట్టుబాట ధర లేక, దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి రాకపోవడం, భూ యాజమానికి కౌలు చెల్లించలేక… తెచ్చిన అప్పులను తీర్చే మార్గం లేకపోవడంతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంటుంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక మంది భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భూములున్న వ్యక్తులు వివిధ పనుల్లో స్థిరపడి, హైదరాబాద్‌లో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ గ్రామాల్లో ఉన్న భూములను స్థానికంగా ఉండే కూలీ రైతులు కౌలుకు తీసుకొని భూములు సాగు చేసుకుంటున్నారు. వ్యవసాయం తప్ప మరో పని తెలియని నిరుపేద రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించకపోవడంపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారుగా లక్ష మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్టు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతుల కోసం 2011లో భూ ఆధీకృత సాగుదారుల చట్టంను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టం అమలు చేయకుండా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో భూమితో సంబంధం లేకుండా పంటనష్టపోయినా, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నా.. రైతులకు పరిహారం వచ్చే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఏ పథకానికి కౌలు రైతులు అర్హులు కారని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో వాస్తవ సాగు దారులైన కౌలు రైతులకు రైతుబంధు, బ్యాంకు రుణంతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. విత్తన సబ్సిడీలు, చివరికి రైతు బీమా కూడా వర్తించడం లేదు. అంతేకాదు, దేవాదాయ, ఇనాం భూములు. పోడు రైతులు, అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించే పరిస్థితి కూడా లేదు.

ఏడేండ్లల్లో 480 మంది..

రైతు ప్రతిఏడాదీ పంటలపై ఆశతోనే పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తాడు. అదే పద్దతిలో కౌలు రైతూ సాగుచేస్తుంటాడు. అయితే పంట దిగుబడి వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన ధాన్యం నగదును భూ యాజమాని ఖాతాల్లో జమ చేయడంతో కౌలు రైతు ఇబ్బందులు పడుతున్నారు. భూమి సాగు చేస్తానని అడగటం దగ్గరనుంచి తీసుకునే నగదు వరకు కౌలు రైతు బతుకు భూ యజమాని వద్ద బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కష్టపడకుండా కౌలు తీసకుంటున్న భూ యాజమానికి ఏ సమస్యలు ఉండవు. పండించే కౌలు రైతు అప్పులపాలైపోతున్నారు. ఎకరం తరి పొలానికి రూ.15 వేల నుంచి 20 వేలు భూ యాజమానికి కౌలు చెల్లించాలి. మెట్ట భూములకైతే ఎకరం రూ.4 వేల నుంచి 6 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇక పంట సాగు పెట్టుబడి వరికి దాదాపు రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన కౌలు రైతులు ఎకరాకు రూ.40 నుంచి 45 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రకృతి సహకరించి, సకాలంలో వర్షాలు పడితే సాధారణంగా ఎకరాకు వరి 25 క్వింటాల ధాన్యం దిగుబడి వస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఎకరాకు రూ.47 వేల ఆదాయం వస్తోంది. అంటే కౌలు రైతుకు మిగిలేది ఎకరాకు రూ.2వేలు. పంట పెట్టుబడికి తెచ్చిన అప్పు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. దీంతో రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏడేండ్ల కాలంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 480 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో రంగారెడ్డి జిల్లాలో 189 మంది, వికారాబాద్ జిల్లాలో 291 ఉన్నారు.

కౌలు తీసుకుంటే అప్పులే – కిష్టయ్య, కౌలు రైతు అంతప్పగూడ

గతేడాది పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న సాగు చేయగా అధిక వర్షాలు పడ్డాయి. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. కౌలుకు తీసుకున్న యాజమానికి నష్టంతో సంబంధం లేకుండా ఎకరాకు 8 వేల చొప్పున పది ఎకరాలకు ఇవ్వాలి. అయితే పంట రాలేదంటే రూ.1000, రూ.1500ల తక్కువ ఇవ్వాలని చెబుతుండటం గమనార్హం. కానీ వచ్చే పంటకు చూద్దామనే పద్దతి ఇప్పుడు లేదు. దీంతో 10 ఎకరాలకు సుమారుగా తక్కువలో తక్కువ రూ.50వేల నుంచి రూ.70వేల వరకు ముందే చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలుతో పాటు పెట్టుబడి పెట్టిన ఖర్చూ భరించాల్సి ఉంటుంది. పట్టాదారు పాసుపుస్తకం లేకపోవడంతో మొక్కజొన్న ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. దీంతో వర్షాలతో తడిసిన మొక్కజొన్నను బయట మార్కెట్లో ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీసం పట్టాదారు పాస్ పుస్తకం లేక రైతుబంధు డబ్బులు కూడా కౌలు రైతులకు ప్రభుత్వం ఇవ్వకపోగా పంట నష్టపోయినందుకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కౌలు రైతు పరిస్థితి దమనీయంగా మారింది.

Next Story

Most Viewed