ఇంటర్ మూల్యాంకనానికి ప్రైవేటు సహకారం

by  |

దిశ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11 లేదా 12 నుంచే వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభవుతుంది. ఆలస్యం చేయొద్దని విద్యాశాఖ మంత్రి ఇంటర్ బోర్డు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జవాబు పత్రాల కోడింగ్, డీ కోడింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈసారి మూల్యాంకన ప్రక్రియలో కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున, వాల్యువేషన్ చేసే ప్రభుత్వ అధ్యాపకులు చాలా మంది వారివారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది కొరత ఏర్పడింది. త్వరగా పూర్తి చేయడానికి ఉన్న ఇబ్బందులతో ఇంటర్ బోర్డు అధికారులు సతమతం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో కార్పొరేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్, ప్రైవేటు జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో శుక్రవారం ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

వాల్యుయేషన్ పనుల్లో పూర్తి సహకారం కావాలని కోరారు. అందుకు ఈ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. బోర్డుకు ఏ విధమైన అవసరం ఉన్నా పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఈసారి కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలల లెక్చరర్లు వాల్యుయేషన్‌లో భాగస్వాములవుతున్నాయి. ఆ కాలేజీల హాస్టల్ భవనాలు కూడా వాల్యుయేషన్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఆ కాలేజీల వాహనాలు కూడా లెక్చరర్ల రాకపోకలకు వినియోగపడనున్నాయి. ఈ మేరకు ఆ కాలేజీల యాజమాన్యం అంగీకరించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. మూల్యాంకనం సమయంలో వ్యక్తుల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ (భౌతిక దూరం) పాటించాల్సి ఉన్నందున ఏటా ఏర్పాటు చేసే 12 కేంద్రాలకు అదనంగా మరో 21 కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇలా కొత్తగా ఏర్పడే అదనపు కేంద్రాలన్నీ ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు, హాస్టళ్ల‌లో ఉండబోతున్నాయి.

Tags: covid 19 effect, lock down, valuation, intermediate board, corporate colleges participation, private colleges

Next Story

Most Viewed