‘ప్రోటోకాల్ పాటించరా..? వెంటనే ఎమ్మెల్యే రఘునందన్ రావుకు క్షమాపణ చెప్పాలి’

by  |
bjp leaders
X

దిశ, దుబ్బాక : పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేను పిలవకుండా, ప్రోటోకాల్ పాటించకుండా మున్సిపల్ చైర్ పర్సన్ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటని కౌన్సిలర్ మల్లారెడ్డి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ఉంటుందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. నిన్న దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులో మురికి కాలువల నిర్మాణానికి, ఎమ్మెల్యే రఘునందన్ రావును పిలవకుండానే మున్సిపల్ చైర్ పర్సన్ చేత శంకుస్థాపన చేయించడం జరిగిందన్నారు. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టినా స్థానిక ఎమ్మెల్యే తప్పనిసరి ఉండాలని తెలిసినా, కావాలనే ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

ఎస్‌డీఎఫ్ నిధులతో చేసే అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యేకు తెలుపకుండా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కొంతమంది ప్రోటోకాల్ పాటించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఒక ఎమ్మెల్యేని అవమానపరచడం విడ్డూరంగా ఉందన్నారు. పక్క నియోజకవర్గాలైన సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల, మెదక్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు లేకుండానే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మరి దుబ్బాకలో ఎమ్మెల్యేను కాదని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే మున్సిపల్ చైర్ పర్సన్ ఎమ్మెల్యే రఘునందన్ రావు కు క్షమాపణ చెప్పాలని లేనియెడల రానున్న రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ రెడ్డి, పర్వతాలు, రాజిరెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed