బోర్డులు తొలగించి మరీ అమ్మకాలు.. అధికారుల ఆదేశాలు బేఖాతర్

by  |
బోర్డులు తొలగించి మరీ అమ్మకాలు.. అధికారుల ఆదేశాలు బేఖాతర్
X

దిశ, కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గంలో అనుమతులు లేని అక్రమ వెంచర్లు కోకొల్లలుగా వెలిశాయి. గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ సాగులో ఉన్న భూముల్ని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వెంచర్లు వేసి భూమి ధరను ఏకంగా నాలుగు శాతం పెంచి మధ్యతరగతి ప్రజలకు విక్రయిస్తున్నారు. తాజాగా లక్ష్మీదేవిపల్లి-చుంచుపల్లి మండలాల్లో ఈ అక్రమ వెంచర్లపై గత నాలుగు రోజుల క్రితం దిశ కథనం ప్రచురించింది.

ఈ కథనానికి స్పందించిన ఎంపీడీవో రామారావు.. లక్ష్మీదేవిపల్లిలోని హేమచంద్రాపురంలో అనుమతులు లేకుండా అమ్మకాలు జరుగుతున్న ఓ వెంచర్‌ని తనిఖీ చేశారు. అక్రమార్కులు పాతిన హద్దు రాళ్లను తొలగించారు. అమ్మకాలు, కొనుగోళ్లు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అధికారులతో కలిసి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ చివరకు ఫలితం లేకుండా పోయాయి. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ హెచ్చరిక బోర్డుని తొలగించడమే కాకుండా.. జంకు బొంకు లేకుండా అమ్మకాలు జరపడం గమనార్హం.

వెంచర్ల యజమానులపై కేసులు..!

అక్రమ వెంచర్ల పై మా దృష్టికి వచ్చిన మరుక్షణమే చర్యలు తీసుకున్నాం. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. హద్దు రాళ్ళు తొలగించాం. నోటీసులు సైతం జారీ చేశాం. మేము లేని సమయంలో ఇలా చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అనుమతులు లేని వెంచర్లలో భూములు కొనుగోలు చేయవద్దని ప్రజలకు తెలియజేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వెంచర్ల యజమానులపై కేసులు నమోదు చేయబోతున్నాం. రామారావు, ఎంపీడీవో.


Next Story

Most Viewed