ఏజెన్సీలో చట్టాలు తుంగలో తొక్కుతున్నా పట్టించుకోరా..?

by  |
building constructions on agency
X

దిశ, వాజేడు : ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కొందరు గిరిజనేతరులు 1/70చట్టానికి తూట్లు పొడుస్తున్నారు బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులు లేకపోయినా అక్రమంగా కట్టడాలు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో చండ్రుపట్ల పేరూరు చెరుకూరు వాజేడు తదితర గ్రామాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తూ 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.

మండలంలో వందల సంఖ్యలో బహుళఅంతస్తుల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటు పంచాయతీ అధికారులు అటు రెవిన్యూ అధికారులు ఎవరికి వారే యమునా అన్న చందంగా వ్యవహరించడంతో బహుళ అంతస్తు కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ మండలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగించ రాదని నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలు తుంగలో తొక్కి గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. చట్టాలను పర్యవేక్షించాల్సిన అధికారులు ముడుపుల మత్తులో మూలుగుతున్నారు అధికారుల తప్పిదం వల్లనే 1/70 చట్టం అమలుకు నోచుకోవడం లేదని ఆదివాసులు వాపోతున్నారు.

వందల సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అధికారులు అలసత్వాన్ని ఆసరగా చేసుకుని కొందరు గిరిజనేతర బడాబాబులు బోలా అంతస్తుల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి ఎలాంటి అనుమతులు లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed