విచ్చలవిడి మద్యం.. అదెలా సాధ్యం?

by  |
విచ్చలవిడి మద్యం.. అదెలా సాధ్యం?
X

దిశ, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యాన్ని, నాటుసారాను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు పూర్తిగా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో చాలా మందికి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. సులభంగా డబ్బులు సంపాధించేందుకు తండావాసులు నాటుసారాను తయారు చేస్తున్నారు.

లాక్ డౌన్ ప్రకటించిన తరువాత మద్యం షాపులకు ఎక్సైజ్ అధికారులు సీల్ చేయడం జరిగింది. చాలా మంది లాక్ డౌన్ ప్రకటించిన రోజు రాత్రే మద్యం షాపుల్లో ఉన్న స్టాక్ లో చాలావరకు ఇతర రహస్య ప్రాంతాలకు తరలించారు. ఆ స్టాక్ ను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు. అదే విధంగా మరికొంత మంది బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. సాధారణ పరిస్థితిలో రూ.40 దొరికే ఛీప్ లిక్కర్ ప్రస్తుతం రూ.300 వరకు పలుకుతుండగా, బీర్లు కూడా ఏకంగా రూ.100కు దొరికేది రూ.400 నుండి రూ.500, బ్రాండెడ్ మద్యం ధరలు వేలలో ఉన్నాయంటే మద్యం వ్యాపారులు ఏ స్థాయిలో మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. లాక్ డౌన్ ప్రకటించకంటే ఒక్కరోజు ముందే జిల్లా వ్యాప్తంగా రూ.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కానీ, మద్యం షాపుల యజమానులు మాత్రం వివిధ మార్గాలలో షాపుల్లో ఉన్న మద్యాన్ని అడ్డదారిలో విక్రయించడం మొదలుపెట్టారు. షాపులు మూసివేసే రోజుకు షాపుల్లో ఉన్న స్టాక్.. ప్రస్తుతం ఉన్న స్టాక్ లెక్కలు చూస్తే అసలు విషయం బయటపడుతుంది.

మరికొంతమంది విక్రయదారులు దొడ్డిదారులు వెతుకుతున్నారు. అడ్డదారిలో మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కర్నూలు, కర్ణాటక ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా మద్యాన్ని జిల్లాకు తెప్పించుకుంటున్నారు. పోలీసుల కళ్ళుగప్పి మద్యాన్ని జిల్లాకు తెప్పించేందుకు వారు అనేక రకాల మార్గాలను వెతుకుతున్నారు. ఇలా దిగుమతి చేసిన మద్యాన్ని ఇష్టానుసారంగా అధిక ధరలకు విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత సమయంలో కొంత మందికి ఇదొక మంచి ఉపాధి అవకాశంగా మారిందనే చెప్పాలి. అదే సమయంలో బ్రాండెడ్ మద్యాన్ని సైతం కల్తీ చేసి విక్రయిస్తున్నారు. చాలావరకు మద్యం బాటిళ్లకు సీల్ ను తీసి ఛీప్ లిక్కర్ ను ఖరీదైన బ్రాండెడ్ మద్యంలో కలిపి అటు ప్రజల ఆరోగ్యంతో అడుకుంటూ దొడ్డిదారిన కాసులు సంపాదిస్తున్నారు.

తండాల్లో గుప్పుమంటున్న గుడుంబా..

లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడడంతో జిల్లాలో మరోసారి గుడుంబా తయారీ జోరందుకున్నది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తండాల్లో గుడుంబా వాసన గుప్పుముంటోన్నది. గతంలో తండాలో నివాసం ఉండే వారికి ప్రధాన జీవనాధారంగా ఉండే గుడుంబా ప్రస్తుతం మరోసారి వారికి కాసుల వర్షం కురిపిస్తోన్నది. తెలంగాణ ఏర్పడినంక జిల్లాలో నాటుసారా తయారు చేసేవారిని గుర్తించి వారికి ప్రభుత్వం ప్రత్యామ్నయ మార్గాలను చూపి నాటుసారా తయారీని నియంత్రణ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో మరోమారు తండాల్లో నాటుసారా బట్టిలు వెలుస్తున్నాయి. ప్రస్తుతం లీటర్ నాటుసారా రూ.400కు పైగా పలుకుతుండడంతో తండావాసులు తిరిగి నాటుసారా కాయడానికి అడ్డదారులు వెతుకుతున్నారు. దీంతో ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారు చేస్తున్న పలువురిపై కొరఢా ఝూళిపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన మూడు వారాల్లో 152 నాటుసారా కేసులు నమోదు అవ్వగా 145మంది అరెస్టు చేశారు. వారి నుంచి 248 లీటర్ల మద్యాన్ని, 156 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దొడ్డిదారిన తెచ్చి విక్రయిస్తున్న 49 లీటర్ల మద్యాని కూడా స్వాధీనం చేసుకున్నారు. 1,021 కేజీల నల్ల బెల్లాన్నిస్వాధీనం చేసుకుని ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేశారు. దీంతో జిల్లాలో మద్యం, నాటుసారా విక్రయం ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎక్సైజ్ అధికారులు వీటిని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అదే నిజమైతే ఈ గణాంకాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గడిచిన మూడు వారాల్లోనే ఈ స్థాయిలో కేసులు నమోదు అయ్యాయంటే వచ్చే మరో 15 రోజుల్లో పరిస్థితి ఎలా వుంటుందో మరి.

Tags: Mahabubnagar, liquor, other states



Next Story

Most Viewed