శరీర భాగాల్లో బంగారం.. ఆపరేషన్ చేసి స్వాధీనం

by  |
gold seized
X

దిశ, క్రైమ్ బ్యూరో: విమానాల ద్వారా మన దేశానికి బంగారం అక్రమంగా దిగుమతి అవుతోంది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ, విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా బంగారం తెచ్చేందుకు అక్రమార్కులు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. దీంతో శంషాబాద్ విమనాశ్రయంలో కేజీల కొద్దీ బంగారం ల్యాండ్ అవుతోంది. 2015 నుంచి 2020 వరకూ దాదాపు 312 కేజీల బంగారాన్ని పట్టుకున్నట్టుగా అధికారిక గణంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచే ఈ బంగారాన్ని అధికంగా తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా భారీగా ఉందని అంటున్నారు. అరబ్ దేశాలలో ఖరీదు తక్కువగా ఉండటంతో మన దేశం నుంచి అక్కడికి వెళ్లినవారు బంగారాన్ని అధికారులకు కంట పడకుండా వివిధ పద్దతుల్లో తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.

ఈ బంగారాన్ని సక్రమంగా తీసుకొచ్చినట్లయితే మన దేశంలోని ధరకు అనుగుణంగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకు తప్పుడు మార్గంలో బంగారాన్ని తెచ్చుకునేందుకు నానా రకాల పాట్లు పడుతుంటారు. కొందరు లగేజీ బ్యాగులలో స్వీటు, ఖారలాగా దాచుకుని తెస్తున్నారు. ఇంకొందరు చెప్పుల కింద హీల్ కట్ చేసి పేస్టు రూపంలో గుర్తించకుండా అమర్చుకుని తెస్తున్నారు. రైస్ కుక్కర్ వైరింగ్‌ల వద్ద, ప్యాంటుకు ధరించే బెల్టు లోపల, లగేజీ బ్యాగులకు బంగారంతో జిప్ తయారు చేయించి, వాటికి పైన వైట్ కోటింగ్ వేయడంలాంటి తదితర అక్రమ మార్గాలనూ ఎంచుకుంటున్నారు. అక్రమార్కులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కస్టమ్స్ అధికారులు, ఎయిర్ ఇంటెలిజెన్స్, డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో పాటు సీఐఎస్ఎఫ్ విభాగం అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. పకడ్బందీగా స్కాన్ చేసి బంగారం ఎక్కడ దాచినా పట్టుకుంటున్నారు. కొందరు శరీర భాగాలలో దాచుకుని కూడా తీసుకొస్తున్నారు. స్కానింగ్‌లో బయటపడటంతో ఆపరేషన్ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

అక్కడి నుంచే ఎక్కువ

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర్నుంచి నేటి వరకూ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు బంగారాన్ని భారీగానే పట్టుకున్నారు. అత్యధికంగా యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా, జెద్దా, హాంకాంగ్, ఒమన్, థాయ్ లాండ్, శ్రీలంక, బెహ్రయిన్, మలేషియా, సింగపూర్ తదితర దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు. 2015 నుంచి 2020 వరకూ 312 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.96.15 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 2015 జనవరి నుంచి మార్చి వరకూ 36 కేజీలు, 2015-16 ఏడాదిలో 80.85 కేజీలు, 2016-17లో 28.86 కేజీలు, 2017-18లో 53.8 కేజీలు, 2018-19లో 40.2 కేజీలు, 2019-20లో 57.91 కేజీలు, 2020- 21 ఏడాదిలో (2020 డిసెంబరు వరకూ) 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో భారీ మొత్తంలో బంగారంతో పాటు రూ.96.15 కోట్లను అధికారులు సీజ్ చేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా

దిశ, రాజేంద్రనగర్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. బంగారాన్ని తరలిస్తున్న ఐదుగురు ప్రయాణికులను శనివారం కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 47.67 లక్షల విలువ గల కిలో పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి (G9458) విమానంలో శంషాబాద్‌కు ఓ ప్రయాణికుడు వచ్చాడు. తాను ధరించిన చెప్పులకు అడుగు భాగంలో బంగారాన్ని పేస్టు రూపంలో అతికించి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతని వద్ద నుంచి 27 లక్షల విలువ చేసే 672 గ్రాముల బంగారం పేస్టును స్వాధీనం చేసుకున్నారు. అలాగే షార్జా నుంచి మరో (6E-1406) విమానంలో శంషాబాద్‌కు నలుగురు ప్రయాణికులు చేరుకున్నారు. వారు 20 లక్షలు విలువ చేసే 471 గ్రాముల బంగారం బిస్కెట్లు, ఉంగరాన్ని నోట్లో పెట్టుకొని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.


Next Story

Most Viewed