అక్కడ యధేచ్చగా మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు..!

by  |
అక్కడ యధేచ్చగా మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు..!
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ పనులకు తీసుకెళ్తున్నామన్న సాకుతో అన్నపురెడ్డిపల్లి మండలంలో మట్టి తవ్వకాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండానే అధికారులు అంతా మా చేతిలోనే ఉన్నారనే ధీమాతో చండ్రుగొండ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు, అనుచరులు ఈ మట్టి రవాణా చేస్తున్నారు. మండలంలోని గుంపెన పంచాయతీ పరిధి కట్టుగూడెం గ్రామ శివారు జాతీయ రహదారి పక్కనే పట్టపగలే మట్టిని తరలించుకుపోతున్నారు. బహిరంగంగా జేసీబీ సాయంతో మట్టిని ట్రాక్టర్లతో నింపి చండ్రుగొండ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తన మండలానికి, తన సొంత పనులకు తరలించుకుపోవడం గమనార్హం.

గుంపెన రెవెన్యూ మౌజాలోని 35వ సర్వే నెంబర్‌లో మట్టి తవ్వకాలు జరపడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమ సొమ్మును జేబుల్లో వేసుకుంటున్నారు. చండ్రుగొండ మండల అధ్యక్షుడికి షాడో లాగా ఉండే తన అనుచరులు మాత్రం ఈ మట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పల్లె ప్రకృతి కోసం తీసుకువెళ్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. కానీ, ఈ మట్టిని చండ్రుగొండ మండలంలో కమర్షియల్ పనులకు వాడుతున్నట్లు సమాచారం. తను చండ్రుగొండ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడినని తన జేసీబీని, ట్రాక్టర్లను ఏ అధికారి కూడా ప్రశ్నించరన్న ధీమాతో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో మాట్లాడిపిస్తానని కొంతమందితో చెప్పడం కొసమెరుపు. సదరు వ్యక్తి అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంపెన గ్రామస్తులు కోరుతున్నారు.

మట్టి రవాణాకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు..

మండలంలో మట్టి తవ్వకాలకు రెవెన్యూ తరఫు నుండి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూకి తప్పనిసరిగా చలాన్‌ కట్టిన తరువాతే మట్టిని తరలించాలి. భద్రకాళి, అన్నపురెడ్డిపల్లి తహసీల్దార్.

Next Story