అధికారుల లీలలు.. లాక్‌డౌన్ ముసుగులో అక్రమంగా..

by  |
అధికారుల లీలలు.. లాక్‌డౌన్ ముసుగులో అక్రమంగా..
X

దిశ, కాప్రా : లాక్‌డౌన్ నేపథ్యంలో కాప్రా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాప్రా, శ్రీనివాస నగర్, చర్లపల్లి , మీర్‌పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతల్లో సెల్లార్, అదనపు అంతస్తుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్నాయి. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. అయితే అక్రమార్కులు మాత్రం తిరిగి తమ పనులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

తాజాగా ఏఎస్‌రావు నగర్ డివిజన్ పరిధిలోని సుబ్రహ్మణ్య నగర్‌లో నిర్మాణమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడి నిర్మాణం అక్రమ కట్టడంగా గుర్తించి 20 రోజుల క్రితం కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసిన ప్రహరీ గోడను.. బిల్డర్ తిరిగి నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మించారని.. అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు సదరు బిల్డర్ నిర్మించిన గోడను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కానీ మళ్లీ గోడను నిర్మిస్తుండగా.. అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు.

ప్రహరి కూల్చివేసిన సమయంలో ఇక్కడ అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి బదిలీ కావడంతో ఆయన స్థానంలో శ్రీధర్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయంలో శ్రీధర్ ప్రసాద్‌కు ఫిర్యాదు అందినప్పటికీ నిబంధనల ప్రకారం ప్రహరి సరిగానే ఉందని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. దీంతో 20 రోజుల క్రితం అక్రమ నిర్మాణంగా గుర్తించిన ప్రహరీని ప్రస్తుతం పట్టించుకోకపోవడం పట్ల పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాప్రాలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story