భారత్‌లో మరిన్ని ఐకియా స్టోర్లు.. వచ్చే ఏడేళ్లలో ముప్పై నగరాలకు విస్తరణ

by  |
ikea store
X

దిశ, వెబ్‌డెస్క్: ఫర్నిచర్ అమ్మకాలలో ప్రపంచ దిగ్గజంగా కొనసాగుతున్న స్వీడన్ కంపెనీ ఐకియా భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. వచ్చే ఏడేళ్లలో భారత్‌లో ముప్పై నగరాలలో కొత్త అవుట్‌లెట్స్ తెరవాలని యోచిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ఇటీవలే ముంబయిలో కూడా ఐకియా స్టోర్‌ను తెరిచిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఐకియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ బెట్జెల్ స్పందించారు. కొత్త అవుట్‌లెట్స్‌లకు సంబంధించిన పనులను అంతుకుముందే ప్రారంభించాలని అనుకున్నా లాక్‌డౌన్ కారణంగా అది వీలు పడలేదని అన్నారు. కానీ కరోనా నెమ్మదించడం.. భారత ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుండటంతో కొత్త స్టోర్స్‌కు సంబంధించిన ప్రక్రియను పరుగులు పెట్టిస్తామని ఆయన తెలిపారు.

2018లో హైదరాబాద్‌లో దేశంలోనే తన తొలి స్టోర్‌ను ప్రారంభించిన ఐకియా.. గతేడాది డిసెంబర్‌లో రెండో స్టోర్‌ను ముంబయి సమీపంలో ప్రారంభించింది. దక్షిణాదిన బెంగళూరులో నిర్మిస్తున్న మూడో స్టోర్ నిర్మాణ దశలో ఉండగా.. మరో ఏడాదిలో అది అందుబాటులోకి రానున్నది. వీటితో పాటు దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా వద్ద ఐకియా భారీ షాటిలైట్ టౌన్‌షిప్‌ను నిర్మించతలపెట్టింది. 753 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 5 వేల కోట్లు) పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. వచ్చే మూడేళ్లలో దీనిని పూర్తి చేయాలని ఐకియా టార్గెట్‌గా పెట్టుకున్నది.

కాగా.. భారత్‌లో ఉత్పత్తయ్యే గూడ్స్, మెటిరియల్స్ నిష్పత్తిని 30 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని పీటర్ బెట్జెల్ అన్నారు. ప్రస్తుతం 22 శాతంగా ఉన్న ఈ ఉత్పత్తులను త్వరలోనే 30 శాతానికి చేర్చుతామని ఆయన వివరించారు. లాక్‌డౌన్ సమయంతో పోల్చితే తర్వాత కాలంలో ఆన్లైన్‌లోనూ అమ్మకాలు బాగా పెరిగాయని అన్నారు. ఏడాది క్రితం మొత్తం అమ్మకాలలో ఆన్లైన్‌ ద్వారా 10-15 శాతం విక్రయాలు జరిపిన తాము.. ప్రస్తుతం దానిని 40 శాతానికి పెంచామని బెట్జెల్ తెలిపారు.


Next Story

Most Viewed