వరవరరావును విడుదల చేయాలి: ఐజేయూ

by  |

దిశ, వెబ్‌డెస్క్: ఏడాదిన్నర కాలంగా అండర్‌ ట్రయిల్ ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజాకవి, రచయిత వరవరరావును తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్‌పై విడుదల చేయాలని ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌‌రెడ్డి, కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి, కె. అమర్‌నాథ్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, కె. విరాహత్ అలీ, శ్రీకాంత్‌ బుధవారం సంయుక్త ప్రకటనలో కోరారు. 80 ఏళ్లున్న వరవరరావును దాదాపు 18నెలలుగా అండర్‌ ట్రయల్ పేరుతో జై ల్లో బంధించడం అప్రజాస్వామిక చర్యగా భావిస్తున్నాం, ఫ్యామిలీ మెంబర్స్‌ ఆయన్ను కలుసుకోలేని వాతావరణం కల్పించడం, కనీసం ఉత్తర ప్రత్యుత్తరాలకు సైతం అవకాశం కల్పించకపోవడం విచారకరమన్నారు. వరవరరావు హెల్త్‌ను జైలు సిబ్బంది పట్టించుకోకపోవడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు.

రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం విచారణలో ఉన్న ఖైదీలకు జీవించే హక్కు ఉన్న విషయాన్ని పాలకులు మరచిపోవడం సహించరానిదన్నారు. ఆయన్ను పుణె నుంచి ముంబై జైలుకు తరలించడంతో అక్కడ కరోనా పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు 70 ఏళ్ల వయస్సున్న వరవరరావు సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్నారని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, వరవరరావు కూతుళ్ల విజ్ఞప్తి మేరకు, మానవతా దృక్పతంతో ఆయన్ను విడుదల చేయాలని కోరారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.



Next Story