గెల్లును గెలిపిస్తే సొంత స్థలం ఉన్నవారందరికీ ఇళ్లు కట్టిస్తా : హరీష్ రావు

by  |
Hareesh Rao
X

దిశ, హుజురాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటుండంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలు ఖాళీ అవుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం మండలంలోని సింగపూర్ గ్రామంలో హరీశ్ రావు సమక్షంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. లక్ష్మీపురం భీంపెల్లి, నర్సక్కపల్లి, రంగపూర్, ఇళ్లందకుంట, బూజునూర్, కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందిన వందలాదిమంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు.

నియోజకవర్గంలో రోజురోజుకు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలుపుపై నియోజకవర్గ అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. సొంత స్థలాలు ఉన్నవారందరి పక్కా గృహాలు కట్టించే బాధ్యత నాది అని, అయితే అది గెల్లు శ్రీనివాస్ గెలుపుపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఈటల చేయని అభివృద్ధి పనులను రెండున్నర ఏళ్ల కాలంలో గెల్లు చేసి చూపిస్తాడని హరీష్ రావు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed