కేసీఆర్ ఆ రూట్లో యాదాద్రికి వెళితే సీఎం పదవికి గండం

by  |
కేసీఆర్ ఆ రూట్లో యాదాద్రికి వెళితే సీఎం పదవికి గండం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని జగదేవ్‌పూర్ మీదుగా వెళ్లి దర్శనం చేసుకున్న చాలామంది సీఎంలు పదవులు కోల్పోయారని ఓ స్వామి సీఎం కేసీఆర్ కు చెప్పడంతోనే, వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేస్తానని హామీ ఇస్తున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చెయ్యలేక చేతులేత్తేశాడని అన్నారు. దత్తత తీసుకుని 8 నెలల తర్వాత కేసీఆర్ కి వాసాలమర్రి గ్రామం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. 2000 జనాభా ఉన్న వాసాలమర్రి మీదుగా యాదాద్రికి వెళ్లడానికే 60 ఫీట్ల రోడ్లు, వరాలు జల్లులు అని విమర్శలు చేశారు.

యాదాద్రి నర్సింహాస్వామి పేరుమీద శ్రీరామ మందిరంను, సర్కారు బడిని కూల్చి శఠగోపం పెట్టాడని విమర్శించారు. వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేయడానికి మార్బలం అవసరం ఏమిటని, ప్రతి ఇంటికి పోలీస్ బందోబస్తు పెట్టిమరీ సీఎం పర్యటన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ ఇచ్చిన షాక్ తోనే, హుజురాబాద్ ఉపఎన్నికల కోసం జిల్లాల పర్యటన చేస్తున్నారన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పేరుచెప్పి కేసీఆర్ చేసిన 4 లక్షల కోట్ల అప్పులు, ప్రభుత్వ భూముల అమ్మకాల విషయంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయిస్తామని, ఈ విషయంలో బీజేపీ పెద్దలతో ఒత్తిడి తెస్తానని అన్నారు. సీఎం చెప్పినట్లు చేస్తూ సర్కారు భూములు కొన్న, అమ్మిన వారికి సహకరించే అధికారులకు భవిష్యత్తులో కష్టాలు తప్పవన్నారు.

రాయలసీమ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గేమ్ ఆడుతున్నాడని ఆంధ్రలో, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టేది ఒక్కటే కాంట్రాక్టు కంపెనీ అని అన్నారు. సీఎం కేసీఆర్‌కు టీకా ఇప్పించలేని కేటీఆర్‌ ప్రధాని మోడీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2019 ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రధాని, ఉప ప్రధాని అవ్వాలని కలలు కన్నాడని, ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం కొవిడ్ రోగుల పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బస్వాలక్ష్మి నర్సయ్య, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు మల్లేష్ యాదవ్, న్యాలం రాజు, నగర అధ్యక్షులు పంచరెడ్డి లింగం, ఓబీసీ నగర అధ్య క్షులు ఆకుల శ్రీనివాస్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.



Next Story