వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ భవిష్యతేంటి?

by  |
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ భవిష్యతేంటి?
X

దిశ, స్పోర్ట్స్ : చరిత్రలో తొలి సారిగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది. పలు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు మ్యాచ్‌లనే టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా చేసి 2019 అగస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజీలాండ్, సౌత్ఆఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య ఈ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఆయా దేశాల మధ్య జరిగే 27 టెస్టు సిరీస్‌లను చాంపియన్‌షిప్‌లో భాగం చేశారు. వీటిలో 71 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.

కానీ, కరోనా కారణంగా ఆరు టెస్టు సిరీస్‌లు రద్దయ్యాయి. వీటిలో బంగ్లాదేశ్ ఆడాల్సినవే నాలుగు ఉన్నాయి. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం(ఎఫ్‌టీసీ)కి అంతరాయం కలగడంతో ప్రస్తుతం ఉన్న పాయింట్ల విధానం ద్వారా పలు దేశాలకు నష్టం చేకూరుతున్నది. రద్దైన మ్యాచ్‌‌లకు చెరి సమానంగా పాయింట్లు పంచాలని ఐసీసీ తొలుత భావించింది. కానీ దీని ద్వారా మిగతా జట్లకు నష్టం చేకూరడంతో ఆ మ్యాచ్‌లను టెస్టు చాంపియన్‌షిప్ నుంచి తొలగించింది.

కొత్త పాయింట్ల విధానం..

టెస్టు చాంపియన్‌షిప్ షెడ్యూల్‌లో అంతరాయం కలగడంతో అన్ని దేశాలకు న్యాయం జరిగేలా కొత్త పాయింట్ల విధానాన్ని ఐసీసీ ప్రవేశపెట్టింది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. షెడ్యూల్ ప్రకారం ముగింపు నాటికి కేవలం 85 శాతం మేర మ్యాచ్‌లే జరగనుండటంతో ఇకపై పాయింట్ల ప్రకారం కాకుండా.. విజయాల శాతం ఆధారంగా ర్యాకింగ్స్ నిర్ణయించనున్నారు.

ఈ విధానానికి ఐసీసీ క్రికెట్ కమిటీ, ఎగ్జిక్యూటీవ్ కమిటీలు కూడా ఆమోద ముద్ర వేశాయి. దీంతో నవంబర్ 19 నాటికి జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా కొత్త ర్యాంకులు కేటాయించారు. ఈ కొత్త విధానం వల్ల ఏ జట్టుకు నష్టం జరగదని ఐసీసీ సీఈవో మను సాహ్ని చెప్పారు. గురువారం కొత్త విధానం ద్వారా ర్యాంకులు కేటాయించడంతో ఆస్ట్రేలియా తొలి స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న టీమ్ ఇండియా రెండో స్థానానికి పడిపోయింది.

ఇలా కేటాయించారు..

2019 అగస్టు నుంచి జరిగిన మ్యాచ్‌లను టెస్టు చాంపియన్‌షిప్‌లుగా పరిగణించారు. భారత్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి ఏడింట గెలవగా.. రెండింటిలో ఓడిపోయింది. 480 పాయింట్లకు గాను ఇండియా 360 పాయింట్లు సాధించగా.. విజయాల శాతం 75గా ఉన్నది. ఆస్ట్రేలియా జట్టు 10 మ్యాచ్‌లు ఆడి ఏడింట గెలిచింది. రెండింట్లో ఓడిపోయి ఒకదాన్ని డ్రా చేసుకుంది. 360 పాయింట్లకు గాను 296 పాయింట్లు సాధించడంతో ఆసీస్ విజయాల శాతం 82గా ఉంది. దీంతో ఆసీస్ తొలి స్థానంలోనూ, టీమ్ ఇండియా రెండో స్థానానికి చేరుకుంది. రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ నిర్వహించాలని ప్రతిపాదించినా ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్ ముగింపునాటికి టాప్ – 2 జట్లతో లార్డ్స్‌లో ఫైనల్స్ నిర్వహించనున్నారు. జూన్‌లో ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత ర్యాంకింగ్ టేబుల్..

Next Story

Most Viewed